"జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ రీఛార్జీ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.."
దేశంలో ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఇటీవల ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ రీఛార్జీ ధరలను (Mobile Tariff Hike) భారీగా పెంచాయి. జియో, ఎయిర్టెల్ సంస్థల పెరిగిన ధరలు జులై 3 నుంచి, అదే వోడాఫోన్ ఐడియా కొత్త ధరలు జులై 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు 11 శాతం నుంచి 25 శాతం వరకు ఉన్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెలికాం ఆపరేటర్లు ఏకపక్షంగా ధరలను పెంచారంటూ ప్రతిపక్ష సభ్యులు మోదీ ప్రభుత్వాన్ని (Opposition Questions On Mobile Tariff Hike) ప్రశ్నించారు. ఏకపక్షంగా ఛార్జీలను పెంచేందుకు, సర్వీస్ ప్రొవైడర్లు అదనంగా రూ.34,824 కోట్లు లబ్ది పొందేందుకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. టారిఫ్ల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు తమ ఆర్థిక పరిస్థితులకు భిన్నంగా 15-16 శాతం పెంచినప్పుడు ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకుందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై కేంద్ర టెలికాం మంత్రి జోతిరాదిత్య సింధియాకు సీఐటీయూ లేఖ రాసింది. ధరల పెంపు పూర్తిగా అసంబద్దమైనదని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL కు సరైన సహకారం, అనుమతులు ఇవ్వడం లేదని.. ఫలితంగా 3G నుంచి 4G, 5G సర్వీసులకు అప్ గ్రేడ్ జరగలేదని CITU ఆరోపించింది. ఫలితంగా ప్రైవేటు టెలికాం ఆపరేటర్లతో BSNL పోటీపడకుండా అడ్డుకున్నారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ విమర్శించారు.
రూ. 34,824 కోట్ల అదనపు ఆదాయం : ప్రైవేటు టెలికాం సంస్థలు కనీసం 15 శాతం ధరలు పెంచాయని, ఫలితంగా 109 కోట్ల యూజర్లు కలిగిన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలకు సంవత్సరానికి రూ. 34,824 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు.
జియో సగటు టారిఫ్ పెరుగుదల 20 శాతంగా ఉందని.. ఫలితంగా సంవత్సరానికి రూ.17,568 అదనపు ఆదాయం వస్తుందని కాంగ్రెస్ నేత తెలిపారు. అదే 38 కోట్ల యూజర్లు కలిగిన ఎయిర్టెల్ సగటున 15 శాతం టారిఫ్ ధరలు పెంచిందని.. ఫలితంగా సంవత్సరానికి అదనంగా రూ.10,704 ఆదాయం వస్తుందని చెప్పారు.
అదే విధంగా మరో ప్రైవేటు టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా సగటున 16 శాతం టారిఫ్లను పెంచిందని, ఫలితంగా 22.37 కోట్ల సబ్స్క్రైబర్లు కలిగిన సంస్థ ఏడాదికి అదనంగా రూ.6552 కోట్ల ఆదాయం పొందుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, TRAI తమ బాధ్యతల నుంచి తప్పుకున్నాయని సుర్జేవాలా విమర్శించారు. 109 కోట్ల మొబైల్ వినియోగదారుపై భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల వరకు మొబైల్ టారిఫ్ల పెంపు చేపట్టలేదన్నారు. ప్రైవేటు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications








