కోయంబత్తూరు కొరియర్ స్కామ్: క్షణాల్లో రూ. 10 లక్షలు మాయం.. మీరూ జాగ్రత్తగా లేకుంటే...!
Courier Scam Alert: కోయంబత్తూరులో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 25 ఏళ్ల యువతి కొరియర్ మోసంలో ఏకంగా రూ.10 లక్షలు పోగొట్టుకుంది. గతేడాది సెప్టెంబర్లో జరిగిన ఈ మోసం వివరాల్లోకి వెళితే.. బాధితురాలికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ముంబైలోని ఫెడ్ఎక్స్ కొరియర్ సంస్థలో ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. అతను మాట్లాడుతూ.. మీ గుర్తింపు కార్డును ఉపయోగించి డ్రగ్స్, చట్టవిరుద్ధమైన వస్తువులున్న ఒక అనుమానాస్పద పార్సెల్ను పంపినట్లు గుర్తించామని చెప్పాడు.
అంతేకాదు, ఈ విషయం చాలా సీరియస్గా ఉందని, వెంటనే స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ అధికారులమని చెప్పి మరికొందరు ఆమెకు ఫోన్ చేశారు. వారు ఆమెను మరింతగా భయపెట్టడానికి స్కైప్ వీడియో కాల్లో మాట్లాడారు. ఆ కాల్లో నకిలీ పోలీసులు ఆమెను డిజిటల్గా అరెస్ట్ చేస్తామని బెదిరించారు.

ఒకవేళ వారు చెప్పినట్లు చేయకపోతే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. భయంతో వణికిపోయిన ఆ యువతి, వారు చెప్పినదంతా నిజమని నమ్మింది. దీంతో వారు అడిగిన వెంటనే తన బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఇచ్చేసింది.
వారు చెప్పినట్లు డబ్బు వెరిఫికేషన్ కోసం అని నమ్మి, విడతల వారీగా రూ.10 లక్షలను వేర్వేరు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బు వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే తిరిగి ఇచ్చేస్తామని వారు ఆమెకు హామీ ఇచ్చారు. డబ్బులు పంపిన కొంత సమయానికే ఆమెకు అనుమానం వచ్చింది.
వారు చెప్పినట్లు డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్కు, కోయంబత్తూరు రూరల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
* పోలీసుల విచారణ
పోలీసులు విచారణ చేపట్టగా, ఈ మోసంలో ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు గతంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, కేరళలో జరిగిన ఇలాంటి మోసాలకు కూడా లింక్ ఉన్నట్లు తేలింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, కేసును వేగవంతం చేశారు.
ఈ బృందం సౌత్ ఢిల్లీలో ఉన్న గోపి కుమార్ అనే 42 ఏళ్ల నిందితుడిని గుర్తించి అరెస్టు చేసింది. అతన్ని కోయంబత్తూరుకు తీసుకొచ్చి మరింత విచారణ చేస్తున్నారు. పోలీసులు అతడి నుంచి మోసానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెబిట్ కార్డులు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అయితే, గోపి కుమార్తో పాటు ఈ ముఠాలో ఉన్న మిగిలిన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకుని చట్టం ముందు నిలబెట్టడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి కొరియర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఈ కొన్ని చిట్కాలు గుర్తుంచుకోవాలి. అవేవో చూద్దాం.
* కాల్స్ వెరిఫై చేయండి
మీకు అనుమానాస్పద పార్సెల్ల గురించి ఫోన్ కాల్స్ వస్తే, వెంటనే అధికారిక కొరియర్ కంపెనీని సంప్రదించి నిజమా కాదా అని నిర్ధారించుకోండి. నేరుగా వారి వెబ్సైట్కు వెళ్లి లేదా కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేసి మాట్లాడటం ఉత్తమం. తొందరపడి ఏ తప్పు చేయకూడదు.
* వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దు, బెదిరింపులకు భయపడవద్దు
ఫోన్లో లేదా ఆన్లైన్లో బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, గుర్తింపు పత్రాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోవద్దు. స్కామర్లు చాలా తెలివిగా మాట్లాడి ఈ సమాచారం మీ నుంచి రాబట్టడానికి ట్రై చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఏ సంస్థ కూడా మీ వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు.
మోసగాళ్లు తరచుగా భయాందోళనలు సృష్టించి బాధితులను ఒత్తిడికి గురిచేస్తారు. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండి, వారు చెప్పేది నిజమా కాదా అని సరిచూసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కాస్త సమయం తీసుకొని ఆలోచించండి. మోసగాళ్లు నిజమైనవారిలా కనిపించడానికి వీడియో కాల్స్ ఉపయోగించవచ్చు. కానీ వారి మాటలను పూర్తిగా నమ్మవద్దు.
వారి సంస్థ వెబ్సైట్కు వెళ్లి అక్కడ ఉన్న వివరాలతో సరిపోల్చండి. మోసపోయామని అనుమానం వస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఎంత త్వరగా స్పందిస్తే, పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఆలస్యం చేస్తే మోసగాళ్లు తప్పించుకునే అవకాశం ఉంది.
ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి, తద్వారా వారు కూడా సురక్షితంగా ఉంటారు.


Click it and Unblock the Notifications








