సంక్రాంతి, మహాకుంభ మేళాను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. లింక్స్ క్లిక్చేస్తే బ్యాంకు అకౌంట్ ఖాళీ!
సైబర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఆఫర్లు, ప్రభుత్వ పథకాలు, పండుగలు, ఉచిత రీఛార్జ్ల పేరుతో ఇ-మెయిల్, మెసేజ్ల ద్వారా లింక్స్ పంపుతున్నారు. ఆ లింక్స్ క్లిక్ చేసిన వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. దీనిపై పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తరహా మెసేజ్లకు స్పందించవద్దని (Cyber Crime) సూచిస్తున్నారు. ఆఫర్లు సహా ఇతర ప్రయోజనాల కోసం సంస్థల అధికారిక వెబ్సైట్ ద్వారానే తనిఖీ చేసుకోవాలని కోరుతున్నారు.
అయితే తాజాగా సైబర్ నేరగాళ్లు సంక్రాంతి (Sankranthi), మహా కుంభ మేళాను (Mahakumbh Mela) టార్గెట్ చేశారు. వీటి పేరుతో లింక్ పంపి మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు Apk లింక్ ను షేర్ చేస్తున్నారు. ఆశపడి ఈ లింక్స్ను క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు.

ఏపీ సీఎం పేరుతో..! :
న్యూ ఇయర్ రీఛార్జ్ ఆఫర్ పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది. నూతన సందర్భం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికీ రూ.749 తో 3 నెలల పాటు రీఛార్జ్ను ఉచితంగా అందిస్తున్నారన్నది ఆ మెసేజ్ సారాంశం. కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయమంటూ అక్కడో లింక్ ఇచ్చారు.
ఉచిత రీఛార్జ్ ఆఫర్ అంటూ ఆశపడి ఈ లింక్ పైన క్లిక్ చేస్తే భారీగా నష్టపోయే ప్రమాం ఉంది. దీంతోపాటు సంక్రాంతి శుభాకాంక్షలు, ఆఫర్లు అంటూ కూడా పెద్ద ఎత్తున మెసేజ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మెసేజ్లపై సైబర్ క్రైం పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ తరహా మెసేజ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.
సంక్రాంతి షాపింగ్ చేసి ఉచిత రీఛార్జ్లు పొందాలంటూ వస్తున్న మెసేజ్లపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు కోరుతున్నారు. ఉచిత రీఛార్జ్లు, పండుగల బంపర్ ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్ల్లోని లింక్స్ పైన క్లిక్ చేయవద్దంటూ సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ఎవరూ అత్యాశకు పోవద్దని కోరుతున్నారు.
నూతన సంవత్సరం ఆఫర్ల పేరుతో అనేక మంది మోసం చేశారని.. సంక్రాంతి సందర్భంగా భారీగా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాలకు ఎంపికయ్యారంటూ వస్తున్న మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అదే విధంగా మహా కుంభ మేళాను కూడా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన కుంభమేళాకు వచ్చే భక్తులను మోసం చేసే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే అప్రమత్తం చేసింది. మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ మేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు హాజరుకానున్నారు.
దీంతో నకిలీ వెబ్సైట్లు సహా లింక్స్తో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. రూమ్స్ సహా ఇతర వాహనాల బుకింగ్ల కోసం అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు 1930 నంబర్ లేదా http://cybercrime.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరింది.


Click it and Unblock the Notifications








