డిజిటల్ ఇండియాపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియాలో ఇప్పుడు డిజిటల్ విప్లవం సునామిలా దూసుకెళుతోందని భారతీయులంతా ఈ డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇండియాలో ఇప్పుడు డిజిటల్ విప్లవం సునామిలా దూసుకెళుతోందని భారతీయులంతా ఈ డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకున్నారని, సాంకేతిక ప్రయోగాలకు భారతదేశం అత్యంత మెరుగైన క్షేత్రంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. డిజిటల్ ఇండియా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్ని రంగాల్లో డిజిటల్ ఆవిష్కరణలకు ..
గడిచిన మూడున్నరేళ్లలో డిజిటల్ ఇండియాలో మనం ఎంతో ముందుకెళ్లాం. నేడు అన్ని రంగాల్లో డిజిటల్ ఆవిష్కరణలకు భారతదేశం హాట్స్పాట్గా మారింది. డిజిటల్ ఇండియా అనేది ప్రభుత్వ ప్రయత్నం మాత్రమే కాదని, ఇది ప్రజల జీవన విధానంగా మారిందన్నారు. డిజిటల్ పరిజ్ఞాన సమ్మిళితం అనేది డిజిటల్ ఇండియా ప్రయాణంలో కీలకమన్నారు.

ఆరుకోట్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా ..
గ్రామీణ భారతదేశంలో ఆరుకోట్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో ‘ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ అక్షరాస్యత మిషన్' చేపట్టాం. ఇందులో భాగంగా ఇప్పటికే కోటి మందికి శిక్షణ ఇచ్చామని, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అనుసంధానం నేపథ్యంలో ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సి ఉందని ప్రధాని తెలిపారు.

118 యూనిట్లు..
2014 నాటికి భారతదేశంలో కేవలం రెండే రెండు మొబైల్ తయారీ విభాగాలుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 118కి చేరిందని ఇది డిజిటల్ ఇండియా విజయమని కొనియాడారు. కేంద్రం జాతీయ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ చిన్న, మధ్య తరహా వ్యాపారుల అవసరాలు తీరుస్తుందని ప్రధాని తెలిపారు.

నాస్కామ్ను అభినందిస్తూ..
ఈ సంధర్భంగా నాస్కామ్ను అభినందిస్తూ ‘‘ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, వర్చ్యువల్ రియాల్టీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్డేటా ఎనలటిక్స్, త్రీడి ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ అండ్ మొబైల్ వంటి 8 కీలకమైన సాంకేతిక అంశాలను నాస్కామ్ గుర్తించిందని, దీంతో పాటు ప్రపంచంలో డిమాండ్ ఉండే 55 ఉద్యోగాలను గుర్తించిందని తెలిపారు.వాటికి శిక్షణ ఇచ్చేందుకు రెడీ అవుతుందని ఇది మరో విజయమని కొనియాడారు.

మొబైల్ ఫోన్ల కనెక్షన్లు 121 కోట్లకు..
కాగా దేశంలో మొబైల్ ఫోన్ల కనెక్షన్లు 121 కోట్లకు చేరాయి. ఆదార్ కార్డు కలిగిన వారు 120 కోట్ల మంది ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగదారులు 50 కోట్ల మంది ఉన్నారు. దేశంలో జనధన్ బ్యాంకు ఖాతాలు 32 కోట్లు ఇవి ఆధార్, మొబైల్ నంబర్లతో అనుసంధానమైనవై ఉన్నాయి.

దీర్ఘకాలంపాటు డిజిటల్ విప్లవం
డిజిటల్ విప్లవం దీర్ఘకాలంపాటు కొనసాగుతుందని, కనీసం ఈ శతాబ్దం చివరి వరకు ఉండే అవకాశముందని హానీవెల్ సంస్థ కార్యనిర్వాహక ఛైర్మన్ డేవిట్ కోటే వెల్లడించారు. డొమైన్ విజ్ఞానం, సెన్సర్లు, సాఫ్ట్వేర్లో నూతన మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఉత్తమ సీఈవోగా ఐదుసార్లు అవార్డు
ఉత్తమ సీఈవోగా వరసగా ఐదుసార్లు అవార్డును అందుకున్న డేవిట్ కోటే పలు విషయాలు వెల్లడించారు. ‘‘ఉద్యోగాన్ని ఎంత చక్కగా చేస్తున్నారన్నది ప్రధానం కాదు, సంస్థలో పనితీరే ముఖ్యం. భారత్లో టెక్నాలజీకి మంచి అవకాశాలున్నాయి. విద్య, వైద్యం, పర్యావరణం అంశాలపై ఆవిష్కరణలు జరగాలి.'' అన్నారు.


Click it and Unblock the Notifications