వాట్సాప్తో టెలికాం మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం.. ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా..?
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకొని, మోసాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం, అధికారులు ఈ తరహా మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఆన్లైన్ స్కామ్, స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్లపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు తాజాగా కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్తో (DoT and Whatsapp Deal) భాగస్వామ్యం కుదుర్చుకుంది. సైబర్ మోసాలు సహా ఇతర అంశాలపై ఇరువురు అవగాహన కల్పించనున్నారు.

ఇందులో భాగంగా ఆన్లైన్ నేరాలు, స్పామ్ పై.. DoT, వాట్సాప్ వర్క్షాప్లను నిర్వహించనున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వాట్సాప్ను వినియోగించుకోనున్నారు. ఇప్పటికే మెటా (Meta) 'స్కామ్ సే బచో' (Scam Se Bacho) పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
వాట్సాప్, టెలికాం మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం నేపథ్యంలో మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లాన్ .. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జోతిరాధిత్య సింధియాతో సమావేశం అయ్యారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, స్పామ్ కట్టడిపై చర్చించినట్లు తెలుస్తోంది.
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కోసం టెలికాం వనరులను దుర్వినియోగంపై ముందస్తు చర్యల కోసం.. DoT డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్ఫాంల ద్వారా అందించిన సమాచారాన్ని వాట్సాప్ ఉపయోగించుకుంటుంది. దీంతోపాటు టెలికాం శాఖ అధికారులు, సంచార్ మిత్రా, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఫీల్డ్ యూనిట్స్ కోసం ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహిస్తారు.
సంచార్ సాథీ ద్వారా మరింత మందికి సమాచారం చేరాలా, మరింత మంది ఈ ప్లాట్ఫాంను వినియోగించుకొనేందుకు వాట్సాప్ ప్రచారం చేస్తుంది. ఇప్పటికే స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్లను బ్లాక్ చేయడం, పొగొట్టుకున్న స్మార్ట్ఫోన్లపై ఫిర్యాదులు, సిమ్ కార్డులను బ్లాక్ చేయడం సహా అనేక సేవల కోసం సంచార్ సాథీ వెబ్సైట్, మొబైల్ యాప్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
ఈ వెబ్సైట్, యాప్ ద్వారా ఆన్లైన్ స్కామ్, స్పామ్ పై రిపోర్టు చేయడం సహా ఇతర సలహాలపై వాట్సాప్ మరింత ప్రచారం చేస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం సిద్ధం చేస్తుంది. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి భాషల్లో ఈ వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.
భారత ప్రజల భద్రత ప్రాధాన్యతగా ఉందని, మెటాతో భాగస్వామ్యం మోసపూరిత వ్యవహారాలు, సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా తెలిపారు. వాట్సాప్ వ్యవస్థను ఇందుకోసం ఉపయోగించుకుంటామన్నారు.
ఆన్లైన్ మోసాలు, స్కామ్ల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలి. ఇప్పటికే మెటా దీనిపై ప్రచారం చేస్తోంది. భారత పౌరుల భద్రత కోసం కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖతో పనిచేస్తున్నట్లు మెటా చీఫ్ గ్లోబర్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లాన్ తెలిపారు. తమ టెక్నాలజీ, ప్రభుత్వ నిబద్దతతో భారతీయులు సురక్షితంగా ఉండేలా సాయం చేస్తామన్నారు.


Click it and Unblock the Notifications








