డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్.. ఇ-కామర్స్, సోషల్మీడియా సంస్థలు డేటాను డిలీట్ చేయాల్సిందే!
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ( Digital personal Data Protection Act - DPDP ) చాలా నెలల కిందటే ఆమోదం పొందింది. అయితే రెండు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) ను విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు ఈ డ్రాఫ్ట్ పై అభిప్రాయాలను తీసుకుంటారు. అయితే ఈ ముసాయిదాలో అనేక కీలక అంశాలున్నాయి. కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించవచ్చని డ్రాఫ్ట్ లో తెలిపింది.
డ్రాఫ్ట్లో (DPDP 2023) ఉన్న వివరాల ఆధారంగా సోషల్ మీడియా, ఇ-కామర్స్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫాంలు వినియోగదారుల వ్యక్తిగత డేటాను వినియోగించని మూడు సంవత్సరాల తర్వాత డిలీట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదాలోని సెక్షన్ 8 లో ఇందుకు సంబంధించిన నిబంధనలున్నాయి.

ఈ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి? :
ఈ నిబంధనలు 50 లక్షల కంటే తక్కువ రిజిస్ట్రర్డ్ యూజర్లున్న ఆన్ లైన్ గేమింగ్ సంస్థలకు, 2 కోట్ల కంటే తక్కువ రిజిస్ట్రర్డ్ యూజర్లు ఉన్న ఇ- కామర్స్ సంస్థలకు, 2 కోట్ల కంటే తక్కువ రిజిస్ట్రర్డ్ యూజర్లున్న సోషల్ మీడియా సంస్థలకు వర్తించనున్నాయి.
యూజర్లకు ఎప్పుడు తెలియజేయాలి? :
అయితే యూజర్ల వివరాలు శాశ్వతంగా డిలీట్ చేసే 48 గంటల ముందే వారికి స్పష్టంగా సమాచారం అందించాలి. ఫలితంగా యూజర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు, ఇతర అడ్రస్ లు సహా ఇతర వివరాలను సేవ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. నిర్దిష్ట సమయంలోగా వారి ఖాతాలను వినియోగించకపోతే వారి డేటా పూర్తిగా తొలగించబడుతుంది.
పూర్తి వివరాలు అందించాలి:
తన నియంత్రణలో ఉన్న డేటా భద్రత కోసం సహేతుకమైన చర్యలు తీసుకోవాలి. డేటా చోరీ జరగకుండా నిరోధించగలగాలి. ఏదైనా సందర్భంలో డేటా చోరీ జరిగితే యూజర్లకు తెలియజేయాలి. ప్రస్తుత పరిస్థితి, డేటాకు చోరీ అనంతర పరిణామాలు సహా ఇతర పూర్తి వివరాలను యూజర్లకు తెలియజేయాలి.
భవిష్యత్లో తలెత్తే సమస్యలు సహా డేటా రక్షణ కోసం తీసుకున్న చర్యలపై సమాచారం అందించాలి. దీంతోపాటు వ్యక్తిగత వివరాల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సమాచారం అందించాలి. దీనిపై సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు వీలుగా సంప్రదించాల్సిన వారి వివరాలు ఇవ్వాలి.
రెగ్యూలేటరీ బాడీగా :
ప్రభుత్వాలు జారీ చేస్తున్న డిజిటల్ లాకర్ లు లేదా గుర్తింపు కార్డులకు లింక్ చేసిన పిల్లల డేటాను ప్రాసెస్ చేసే ముందు వారి తల్లిదండ్రుల అనుమతి కోరాలి. దీంతోపాటు డేటా ప్రొటెక్షన్ బోర్డును రెగ్యూలేటరీ బాడీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే డిజిటల్ కార్యాలయంగా మాత్రమే పనిచేస్తుంది.
జరిమానాలు అమలు, ఉల్లంఘనల విచారణ :
ఈ బోర్డుకు కొన్ని నిర్దిష్టమైన అధికారాలు ఉండాలని పేర్కొన్నారు. జరిమానాలు అమలు చేయడం, డేటా ఉల్లంఘనలపై పూర్తి విచారణ చేసేందుకు అధికారాలను కలిగి ఉంటుంది. ఈ బిల్లు 2023 ఆగస్టులోనే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం అభిప్రాయ సేకరణ కోసం ముసాయిదాను విడుదల చేశారు.


Click it and Unblock the Notifications








