అమెజాన్, ఫ్లిఫ్కార్ట్లకు భారీ షాక్, ఆంక్షలు నేటినుంచి అమల్లోకి
కేంద్ర ప్రభుత్వం గతేడాది ఈ-కామర్స్ సంస్థల వ్యాపార నిబంధనలను కఠినతరం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం గతేడాది ఈ-కామర్స్ సంస్థల వ్యాపార నిబంధనలను కఠినతరం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల దూకుడుకు కళ్లెం వేసేలా కొత్త ఈ-కామర్స్ పాలసీలో పలు నిర్ణయాలను గతేడాది తీసుకున్నది. ఈ-కామర్స్ కంపెనీలపై సంప్రదాయ వ్యాపారుల ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థపై దృష్టి పెట్టిన మోదీ సర్కారు.. ఒక విధంగా కొరడానే ఝళిపించింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులున్న ఈ-కామర్స్ సంస్థల జోరుకు బ్రేక్ వేసింది. దేశీయ వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేలా నియమ, నిబంధనలను సవరించింది. ఈ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రత్యేక అమ్మకాల ఒప్పందాలను
ఈ నిబంధనల ప్రకారం తమకు వాటాలున్న సంస్థల ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముకోరాదని, అలాగే ఆయా వస్తువుల కోసం ప్రత్యేక అమ్మకాల ఒప్పందాలను కుదుర్చుకోరాదని ఈ-కామర్స్ మార్కెటీర్లకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ తరహా ఎక్స్క్లూజివ్ డీల్స్తో మార్కెట్లో ఆయా వస్తువుల ధరలు ప్రభావితం అవుతున్నాయని తెలిపింది.

25 శాతానికిపైగా తమ ఉత్పత్తులను
ఈ-కామర్స్ సంస్థ లేదా దాని గ్రూప్ సంస్థల ద్వారా వాటాలను కలిగి ఉన్న ఏ వ్యాపార సైంస్థెనా.. తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం సదరు ఈ-కామర్స్ సంస్థను వేదిక చేసుకోరాదు. తద్వారా ఆన్లైన్ విక్రయాలకు దిగకూడదు, ఏ వ్యాపారైనాసరే ఒకే ఆన్లైన్ సంస్థ వేదికగా 25 శాతానికిపైగా తమ ఉత్పత్తులను అమ్మడానికి వీల్లేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ప్రభుత్వ నిర్ణయం భేష్: సీఏఐటీ.
నూతన ఈ-కామర్స్ పాలసీని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) స్వాగతించింది. చాలాకాలం పోరాటం తర్వాత సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించింది. ప్రభుత్వ నిర్ణయాలు తూచా తప్పకుండా అమలైతే మంచిదేనన్న సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్.. దీనివల్ల ధరల నిర్ణయంపై గుత్తాధిపత్యం పోగలదన్నారు.

ఆన్లైన్ మార్కెటీర్లలో మిశ్రమ స్పందన.
ప్రభుత్వ నిర్ణయాలపై ఆన్లైన్ మార్కెటీర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ-కామర్స్ సంస్థలు నిజాయితీతో, స్వేచ్ఛగా సేవలను అందిస్తున్నాయని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల(ఎంఎస్ఎంఈ)కు లాభం చేకూర్చుతున్నాయని స్నాప్డీల్ తెలిపింది.

అమెజాన్ స్పందన
అమెజాన్ ఇండియా ప్రతినిధి మాత్రం ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేసిన తర్వాతే స్పందిస్తామన్నారు. ఈ రకమైన విధానం దేశంలో పెట్టుబడులను దెబ్బతీస్తుందని మరో ఈ-కామర్స్ సంస్థ సీనియర్ ఉద్యోగి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

పారదర్శకతకు ప్రాధాన్యం.
ఆన్లైన్ రిటైల్ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ)పై విధానాన్ని సవరించిన కేంద్రం.. కొనుగోలుదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ల విషయంలో పారదర్శకంగా, ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా వ్యవహరించాలని ఈ-కామర్స్ మార్కెటీర్లకు సూచించింది.

ఏటా సెప్టెంబర్ 30లోగా
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏటా సెప్టెంబర్ 30లోగా నిర్దేశిత మార్గదర్శకాలను పాటించామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఓ చట్టబద్ధ గణాంక నిపుణుడిచే రూపొందించిన నివేదికను, ధ్రువపత్రాన్ని దాఖలు చేయాలని కూడా తెలిపింది.

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి
ఈ మార్పులన్నీ కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సవరించిన పాలసీ ప్రకారం ఈ-కామర్స్ కార్యకలాపాల్లో 100 శాతం ఎఫ్డీఐకి అనుమతి ఉన్నది. కాగా నేటి నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications