నిరుద్యోగులకు మస్క్ బంపరాఫర్.. డిగ్రీ లేకున్నా టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వొచ్చు!
ప్రముఖ పారిశ్రామికవేత్త టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో సంచలన మార్పులు చేశారు. తన కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ "ఎవ్రీథింగ్ యాప్" కోసం టాలెంట్ ఉన్న ఇంజనీర్లను ఆహ్వానించిన మస్క్, ఉద్యోగాల కోసం డిగ్రీలు లేదా పెద్ద కంపెనీల అనుభవం అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మస్క్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. "మీరు ఏ స్కూల్కు వెళ్లారో లేదా అసలు స్కూల్కు వెళ్లారో లేదో కూడా మాకు అనవసరం. మీ కోడ్ చూపిస్తే చాలు" అని ఆయన తేల్చి చెప్పారు. అంటే, ప్రతిభావంతులైన వ్యక్తులు కేవలం తమ నైపుణ్యాలను నిరూపించుకుంటే చాలు, ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండానే ఆయన టీమ్లో చేరవచ్చు.

* ఇది కొత్తేమీ కాదు..
నిజానికి, మస్క్ ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదేమీ కొత్త కాదు. చాలా కాలంగా ఆయన డిగ్రీల కంటే నైపుణ్యాలకు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. 2014లోనే టెస్లాలో ఉద్యోగం పొందడానికి యూనివర్సిటీ డిగ్రీ తప్పనిసరి కాదని ఆయన నొక్కి చెప్పారు. ఒక వ్యక్తి ఏం సాధించగలడు అనేదే ముఖ్యమని, వారి అకాడమిక్ సర్టిఫికెట్లు కాదని ఆయన బలంగా నమ్ముతారు.
* చదువుపై మస్క్ విమర్శలు
ప్రస్తుత విద్యా విధానంపై మస్క్ అనేక విమర్శలు చేస్తున్నారు. బట్టీ పట్టడం, గుర్తించిన పరీక్షలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, నిజ జీవిత సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించడంలో విఫలమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన కంపెనీలైన టెస్లా, స్పేస్ఎక్స్, ఇప్పుడు ఎక్స్ కూడా ఉద్యోగులను నియమించుకునే విషయంలో ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి.
* కొందరు హర్షిస్తే.. కొందరు విమర్శిస్తున్నారు..
మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన తీసుకున్న ఈ ఓపెన్ అప్రోచ్ను మెచ్చుకుంటున్నారు. ఫార్మల్ క్వాలిఫికేషన్లు లేని ప్రతిభావంతులైన వ్యక్తులకు ఇది గొప్ప అవకాశం అని అంటున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది అన్ని కంపెనీలకు, ముఖ్యంగా పెద్ద కంపెనీలకు సరిపోకపోవచ్చని విమర్శిస్తున్నారు. ఏదేమైనా, మస్క్ మాత్రం ఫలితాలపై, కొత్త ఆవిష్కరణలపై తన దృష్టిని కొనసాగిస్తున్నారు.
* మస్క్ 'ఎవ్రీథింగ్ యాప్' విజన్..
"ఎవ్రీథింగ్ యాప్" విషయానికొస్తే, Xను ఒక విస్తృతమైన వేదికగా మార్చాలనేది మస్క్ ఆలోచన. ఇది కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాకుండా, పేమెంట్స్, మెసేజింగ్, ఈ-కామర్స్, మల్టీమీడియా వంటి అనేక సేవలను ఒకే చోట అందించేలా రూపొందించాలని ఆయన భావిస్తున్నారు. చైనాలో బాగా పాపులర్ అయిన వీ చాట్ తరహాలో, X ద్వారా ప్రజలు కనెక్ట్ అవ్వడానికి, షాపింగ్ చేయడానికి, డబ్బులు చెల్లించడానికి వీలు కలుగుతుంది. X ఒక గ్లోబల్ హబ్గా ఎదగాలని మస్క్ ఆశిస్తున్నారు.
* పనులు మొదలయ్యాయి..
ఈ దిశగా పనులు కూడా మొదలయ్యాయి. 2025 నాటికి X మనీ (పేమెంట్ సర్వీస్), X టీవీ (స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్) వంటి ఫీచర్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా, 2024 చివరిలో ప్రవేశపెట్టిన AI చాట్బాట్ గ్రోక్లో కూడా భారీ మార్పులు చేయబోతున్నారు. ఈ మార్పుల ద్వారా ప్రజలు ఇంతకుముందు ఎన్నడూ ఊహించని విధంగా కనెక్ట్ అవుతారని X CEO లిండా యాకరినో ఆశాభావం వ్యక్తం చేశారు.
* మళ్లీ తనదైన శైలిలో సంచలనం
మొత్తానికి, ఎలాన్ మస్క్ తన బోల్డ్ ఐడియాలతో మరోసారి పరిశ్రమలను, ఆలోచనలను మారుస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నా, ఆయన మాత్రం తన లక్ష్యంపై నమ్మకంగా ముందుకు సాగుతున్నారు.


Click it and Unblock the Notifications








