ATM ల ద్వారా PF నగదు విత్డ్రా ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే?
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల సౌకర్యం కోసం ఇటీవల అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ మొత్తాన్ని భారీగా పెంచింది. అప్పటి వరకు ఈ మొత్తం రూ.1 లక్ష ఉండగా.. రూ.5 లక్షల వరకు పెంచింది.
అయితే ఉద్యోగాలు తమ PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేస్తామని ఇప్పటికే కార్మిక శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఈ ప్రక్రియలో గతంలో ఉన్న జాప్యాన్ని గణనీయంగా నివారించింది. ఫలితంగా ఉద్యోగులు అత్యవసర సమయాల్లో ఈ PF మొత్తాన్ని సులభంగా తీసుకొనేందుకు అవకాశం కలుగుతోంది.

జూన్ నుంచే ఈ పక్రియను ప్రారంభించాలని భావించినా :
ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు PF నగదును ATM ల ద్వారా కూడా విత్డ్రా చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని కార్మిక శాఖ ఇటీవల వెల్లడించింది. ఈ సంవత్సరం జూన్ నుంచే ఈ పక్రియను ప్రారంభించాలని భావించింది. ఇందుకు సంబంధించిన IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా సిద్ధం చేసింది. కార్మిక శాఖ కూడా ప్రకటన చేసింది.
బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశం :
తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఏటీఎంల ద్వారా PF నగదును విత్డ్రా చేసుకొనే అవకాశం వచ్చే సంవత్సరం జనవరి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మనీ కంట్రోల్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇలా విత్డ్రా చేసుకొనే నగదు మొత్తంపై ఎంత పరిమితి విధించాలనే దానిపై బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది :
ఈ సమావేశం అక్టోబర్ రెండో వారంలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బోర్డు మీటింగ్లో తీసుకొనే నిర్ణయానికి అనుగుణంగా జనవరి నుంచి ATM ల ద్వారా PF ఉపసంహరణ విధానం అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. దీంతో అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు చాలా ఉపయోగం కలగనుంది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ప్రస్తుతం 7.8 కోట్ల మంది చందాదారులున్నారు. అనారోగ్యం, ఇంటి నిర్మాణం సహా ఇతర కొన్ని సందర్భాల్లో PF నగదును విత్డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. గతంలో క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం చాలా సమయం తీసుకొనేవారు. ప్రస్తుతం తక్కువ సమయంలోనే క్లెయిమ్లను సెటిల్ చేస్తున్నట్లు గతంలోనే EPFO తెలిపింది.
* ఇటీవలే EPFO కీలక ప్రకటన చేసింది. UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ను కొత్తగా క్రియేట్ చేయడం లేదా యాక్టివేట్ చేసేందుకు UMANG యాప్ను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపింది.
UMANG యాప్లో UAN క్రియేట్ యాక్టివేట్ చేసేందుకు ఆధార్ ఫేస్ RD యాప్ ను కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందని EPFO స్పష్టం చేసింది. ఈ రెండు యాప్లతోపాటు ఆధార్ నంబర్లో లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్ కూడా అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








