అనిల్ అంబానీకి షాకిచ్చిన ఎరిక్సన్, ఏకంగా జైలుకే !
రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి స్వీడన్ దేశం నుంచి మరో ఎదురు దెబ్బ తగిలింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి స్వీడన్ దేశం నుంచి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ రావాల్సిన బకాయిలను చెల్లించేంతవరకు ఆయనను విదేశాలకు పారిపోకుండా చూడాలని సుప్రీంను కోరింది. ఆర్కాం ఛైర్మన్ అనిల్ అంబానీని జైలుకు పంపి, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తద్వారా రూ.550 కోట్ల బాకీని వడ్డీతో సహా చెల్లించేలా చూడాలంటూ రెండవ పిటిషన్ దాఖలు చేసింది.

ఇతర అధికారులు కూడా..
రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ అనిల్ అంబనీతో సహా ఈ కంపెనీలకు చెందిన ఇతర అధికారులు దేశం విడిచిపోకుండా నివారించేలా హోం మంత్రిత్వశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరింది.

కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకుగాను..
అంతేకాదు గడువులోపు బాకీ చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకుగాను అనిల్ అంబానీని జైలుకు పంపాలని ఈ పిటీషన్లో స్వీడన్ కంపెనీ డిమాండ్ చేసింది.

కోర్టు ఆదేశాల ఉల్లంఘన రెండవసారి
ఎంతో కాలం నుంచి ఆర్కాం చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నామని ఎరిక్సన్ తెలిపింది. కాగా 550 కోట్ల రూపాయల చెల్లింపునకు అంబానీ కోర్టులో వ్యక్తిగత హామీ ఇచ్చారు, కానీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ఇది రెండవసారి. ఈ నేపథ్యంలో ఆర్కాంపై దివాలా చర్యలు చేపట్టాలని ఎరిక్సన్ సీనియర్ అడ్వకేట్ అనిల్ ఖేర్ కోరారు.

ఒప్పందం గడువు
ఇదిలా ఉంటే వైర్లెస్ ఆస్తుల విక్రయానికి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం గడువును పొడిగించుకుంటున్నట్లు ఆర్కామ్, జియో ప్రకటించాయి. ఆర్కామ్కు చెందిన స్పెక్ట్రం డీల్కు టెలికం శాఖ నుంచి అనుమతులు రాని నేపథ్యంలో ఈ డీల్ను పొడిగించుకోవాలని ఇరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి.

2019 జూన్ 28 వరకు
రిలయన్స్ కమ్యూనికేషన్స్తో కుదుర్చుకున్న ఆస్తుల కొనుగోలు ఒప్పంద కాలపరిమితిని 2019 జూన్ 28 వరకు ఆర్జియో పొడిగించుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.

ఆర్కామ్ సైతం విడిగా ప్రకటన
ప్రభుత్వపరమైన అన్ని రకాల అనుమతులు, ఆమోదాలు, రుణదాతల అంగీకారం పొంది సదరు ఆస్తులపై ఉన్న చిక్కులన్నీ తీరాకే కొనుగోలు జరుగుతుందని జియో తెలిపింది.కాగా టవర్లు, ఫైబర్, ఎంసీఎన్, స్పెక్ట్రమ్ విక్రయానికి సంబంధించి ఆర్జియోతో కుదుర్చుకున్న ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నట్లు ఆర్కామ్ సైతం విడిగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications








