మీ పేరుతో వచ్చిన పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని ఫోన్... స్కైప్ ద్వారా కాల్ చేయాలని చెప్పి.. ఏం చేశారంటే..?
సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతునే ఉన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన పార్శిల్ స్కామ్ ద్వారా అనేక మంది మోసపోతున్నారు. పోలీసు అధికారులు మాదిరిగా ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు.. కేసుల పేరుతో భారీగా నగదు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చెందుతున్న బాధితులు లక్షల రూపాయలను బదిలీ చేస్తున్నారు. చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలో చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ మహిళ నేరగాళ్ల ( karnataka woman loses RS7.9 lakh in fake parcel scam ) చేతిలో మోసపోయింది.
తాజాగా FedEx పేరుతో పార్శిల్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఓ మహిళ ఈ స్కామ్లో ఏకంగా రూ.7.9 లక్షలు కోల్పోయారు. అయితే ఈ తరహా స్కామ్ లు ఎలా జరుగుతున్నాయంటే.. మీకు వచ్చిన పార్శిల్ లో నకిలీ పాస్పోర్టులు, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలు ఉన్నాయని నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. అనంతరం పోలీసుల తరహాలోనూ ఫోన్ లు చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు.

పోలీస్ స్టేషన్ కు రావాలని లేదా ధ్రువీకరణ కోసం కొంత నగదును తాము చెప్పిన బ్యాంకు ఖాతాలకు పంపాలని సూచిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురవుతున్న బాధితులు ఎటువంటి ఆలోచన చేయకుండా వారు చెప్పిన విధంగా లక్షల రూపాయలకు పంపుతున్నారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.
తాజా ఘటనలో కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఓ మహిళకు జూన్ 22న ఫోన్ వచ్చింది. FedEx ప్రతినిధిగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఆమె పేరుతో ఓ పార్శిల్ వచ్చిందని, అందులో కొన్ని పాస్పోర్ట్లు, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలు ఉన్నాయని తెలిపాడు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆమెకు చెప్పాడు.
అయితే అనంతరం ముంబై పోలీసుల పేరుతో ఓ వ్యక్తి కాల్ చేశాడు. ఈ కేసులో విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలని లేదా స్కైప్ ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ చేయాలని సూచించాడు. పోలీస్ వెరిఫికేషన్ కోసం రూ.7.9 లక్షలు పంపాలని చెప్పాడు. అయితే వెంటనే ఆమె ఆ నగదు అంతా బదిలీ చేశారు. చివరికి మోసపోయినట్లు గుర్తించింది.
ఈ తరహా ఘటనల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సంస్థలు గానీ పోలీసులు గానీ ఎప్పుడూ నగదు డిమాండ్ చేయరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు ఫోన్ నంబర్లను తనిఖీ చేయండి. థర్డ్ పార్టీ యాప్లు లేదా ఇతర మార్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలి. లేదా నేరుగా సైబర్ క్రైం సంస్థలకు ఫిర్యాదు చేయాలి.
గిజ్బాట్ తెలుగు వెబ్సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








