ChatGPT, డీప్సీక్ వినియోగంపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. అసలు ఏం జరిగింది?
టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారీ మార్పులను తీసుకొచ్చింది. ఓపెన్ ఏఐకి చెందిన ChatGPT AI చాట్బాట్ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. అనంతరం మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు AI చాట్బాట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే తాజాగా చైనాలోని స్టార్టప్ సంస్థ రూపొందించిన డీప్సీక్.. భారీ ప్రకంపనలకు కారణం అయింది. పూర్తి ఉచితంగా వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చింది.
6 మిలియన్ డాలర్లతో :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ చాట్బాట్ల కోసం ఆయా సంస్థలు భారీగా ఖర్చు చేశాయి. అయితే చైనాకు చెందిన సంస్థ విడుదల చేసిన డీప్సీక్ కేవలం 6 మిలియన్ డాలర్లతో కొత్త ఏఐ మోడల్ను రూపొందించింది. అయితే లాంచ్ అయిన వెంటనే యాప్ స్టోర్లతో దూసుకెళ్లింది. దీంతోపాటు అమెరికా టెక్ పరిశ్రమను షేక్ చేసింది.

అనేక దేశాల ఆందోళన :
డీప్సీక్ R1 మోడల్పై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ డేటా చైనాలో స్టోర్ కానుంది. దీంతోపాటు ఈ డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకొనే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు తన ఉద్యోగులను కీలక సూచనలు చేశాయి. డీప్సీక్ను వినియోగించవద్దని సూచించాయి.
డేటా సేకరణపై ఆందోళన :
ఐర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ వంటి దేశాల సెక్యూరిటీ ఏజెన్సీలు డీప్సీక్ డేటా సేకరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ, తైవాన్, ఆస్ట్రేలియా దేశాలు డీప్సీక్ యాప్ వినియోగాన్ని నిషేధం విధించాయి. అయితే భారత్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ల వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం :
ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీపీటీ, డీప్సీక్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ల వినియోగానికి దూరంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఈ అంతర్గత సూచనలు చేసినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిన్న భారత్ పర్యటనకు వచ్చిన ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాట్జీపీటీకి భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత్ లీడింగ్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతోపాటు డీప్సీక్పైనా శామ్ ఆల్టమన్ కీలక వ్యాఖ్యలు చేశారు, చాట్జీపీటీని డీప్సీక్ కాపీ కొట్టిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
భారత్ కూడా సొంత ఏఐ మోడల్ ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. గత 18 నెలలుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నట్లు చెప్పారు. భారత్లోని భాషలు, సంస్కృతి, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా AI మోడల్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు. ఆరుగురు ప్రధాన డెవలపర్లు దీనిపై పనిచేస్తున్నట్లు తెలిపారు.
భారత్ ఏఐ వెర్షన్ 10 నెలల్లో సిద్ధం కావచ్చని చెప్పారు. ప్రారంభంలో ఏఐ ట్రైనింగ్ కోసం 10000 GPU లను సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 18600 GPU లు ఉన్నాయి. ఎన్విడియా H100, H200 వంటి హై పెర్ఫార్మెన్స్ GPU, MI325 మోడళ్లు కూడా ఉన్నాయి.
డీప్సీక్ 2500 GPU లపై శిక్షణ పొందింది. అదే చాట్జీపీటీ 25000 GPU లపై ట్రైనింగ్ పొందింది. అయితే భారత్ 15000 కంటే ఎక్కువ హైఎండ్ GPU లను కలిగి ఉంది. ఇవి AI మోడల్ను శిక్షణ ఇచ్చేందుకు కీలకం కానున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications








