ఆధార్ మిస్ యూజ్ చేస్తే రూ. 10 వేలు వదిలించుకోవాల్సిందే
ట్రాన్సాక్షన్ సమయంలో మీరు తప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారా? అయితే ఇది మీ లాంటి వారికే. అలాంటి పరిస్థితుల్లో రూ.10,000 వరకు జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి! ఇకపై పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్ నంబరును ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తే భారీ జరిమానా తప్పదు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా పాన్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని, దాని స్థానంలో ఆధార్ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆధార్ నెంబర్ను సమర్పించే సమయంలో తప్పుడు అంకెలు నమోదు చేస్తే రూ.10వేల జరిమానా నిబంధనను వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. అందుకనుగుణంగా సంబంధిత చట్టాల్లో సవరణలు చేసి సెప్టెంబర్ 1 నుంచి జరిమానా నిబంధనను తీసుకురావాలనుకుంటోంది. ఇప్పటికే ఐటీ చట్టంలోని సెక్షన్ 272బి సవరించాలని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

తప్పుగా ఇస్తే రూ.10వేల ఫైన్
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వంటి చోట్ల పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డును ఉపయోగించవచ్చునని ఇటీవల కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే దీనిని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక లావాదేవీల సమయంలో ఆధార్ నెంబర్ తప్పుగా ఇచ్చిన వారిపై రూ.10వేల జరిమానా విధిస్తుంది. ఇందుకు సంబంధించి చట్టంలో మార్పు తేనుంది.

సెప్టెంబర్ 1వ తేదీ నుండి జరిమానా
చట్ట సవరణ సంబంధిత చట్టాలలో సవరణలు చేసిన అనంతరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి జరిమానా నిబంధన వర్తిస్తుందని భావిస్తున్నారు. ఐటి చట్టంలోని సెక్షన్ 272 బి (సెక్షన్ 139 ఎ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా విధించేది) సవరించాలని బడ్జెట్ సందర్భంగా ప్రతిపాదించారు. ఇందులో పెనాల్టీ అంశాన్ని ప్రస్తావించారు.

ప్రతి ఉల్లంఘనపై రూ.10,000 జరిమానా
హైవాల్యూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్లలో ఆధార్ నెంబర్ సరిగా వేయని వ్యక్తిపై, ప్రతి ఉల్లంఘనకు రూ.10,000 జరిమానా విధించవచ్చునని చెబుతున్నారు. అదే సమయంలో పెనాల్టీ విధించడానికి ముందు సదరు వ్యక్తి వాదన వినాలని కూడా చెబుతున్నారు. జూలై 5న ప్రవేశపెట్టిన బడ్జెట్ను అనుసరించి నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పాన్ కార్డుల స్థానంలో ఆధార్ను
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుంచి జనాభా డేటాను పొందిన తరువాత ఆదాయపు పన్ను విభాగం వ్యక్తికి ఆధార్ నెంబర్ ఆధారంగా పాన్ కేటాయించాలి. ఇప్పటికే తన ఆధార్ను తన పాన్తో అనుసంధానించిన వ్యక్తి కూడా తన ఎంపిక ప్రకారం పాన్ కార్డుల స్థానంలో ఆధార్ను చట్ట ప్రకారం ఉపయోగించవచ్చని' బడ్జెట్లో ప్రతిపాదించారు. పాన్ నెంబర్ కోట్ చేయడం తప్పనిసరి అయిన అన్ని ప్రదేశాల్లో ఆధార్ అంగీకరించడానికి బ్యాంకులు, ఇతర సంస్థలు అందుకు తగినట్లుగా మార్పులు చేయనున్నాయి.

22 కోట్ల పాన్కార్డులు, ఆధార్తో అనుసంధానం
రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మనదేశంలో 22 కోట్ల పాన్కార్డులు, ఆధార్తో అనుసంధానించి ఉన్నాయి. 120కోట్ల మందికి పైగా ప్రజలు మన దేశంలో ఆధార్కార్డులు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆధార్ ఉంటే పాన్ తప్పనిసరి కాదు. కాబట్టి ఇది ప్రజలకు గొప్ప సౌలభ్యం. ఇక నుంచి బ్యాంకుల్లో కూడా రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన నగదును డిపాజిట్ చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఆధార్ను ఉపయోగించి నగదు బదిలీలు చేసుకోవచ్చు.' అని పాండే తెలిపారు.


Click it and Unblock the Notifications








