న్యూఢిల్లీ: అమెరికాలో మరో ఆర్థిక మాంద్యం వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ప్రారంభంకానుందని, దీనికి కూడా మూడింట ఒక వంతు అవకాశాలు మాత్రమే ఉన్నాయని రీసెర్చ్ సంస్థ గోల్డ్మన్ సాక్స్ వెల్లడించింది. కేవలం దేశ ఆర్థిక విలువ మాత్రమే మార్కెట్లను వెనక్కు తిప్పలేదని అభిప్రాయపడుతూ, ఫండమెంటల్స్ పరంగా మరింత మద్దతు కోరుతూ అమెరికా ముందుకు సాగితేనే మేలు చేకూరుతుందని తెలిపింది. యూరోపియన్ కమర్షియల్ బ్యాంకు ఇప్పటికే ఇటలీ, స్పెయిన్ ప్రభుత్వాలు జారీ చేస్తున్న డెట్ బాండ్లను కొనుగోలు చేస్తూ ఆయా దేశాలను ఆదుకుంటోందని, ఇసిబి ఎంత వరకూ యుఎస్ బాండ్లు కొంటూ వెడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా వెల్లడించలేమని తెలిపింది.
ఎఫ్ఒఎంసి విధానం ఇన్వెస్టర్లలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని, వచ్చే సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు జరగవచ్చని వివరించింది. ప్రస్తుతం కనిష్ఠ స్థాయిల వద్ద గ్లోబల్ డేటా స్థిరత్వం దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోందని, అదే జరిగితే కాస్తంత శుభపరిణామమని, ఒకవేళ పతనమే కొనసాగిన పక్షంలో 8 నుంచి 10 శాతం వరకూ మార్కెట్లు నష్టపోవచ్చని భావిస్తున్నట్టు తెలిపింది.
ఇటీవలి ప్రపంచ మార్కెట్ల పతనం తరువాత డివిడెండ్ రాబడికి, రియల్ బాండ్ విలువకు మధ్య తేడా నాలుగు శాతం వరకూ పెరిగి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిందని తెలిపింది. సగటు స్థాయిల నుంచి నిక్కీ దిగజారడం, యుఎస్ స్టాక్ ఫ్యూచర్ల పతనం, చైనా మార్కెట్ల పనితీరు భయాందోళనలను పెంచుతున్నాయని వివరించింది.