చిన్న వ్యాపారులకు ఇది నిజంగా శుభవార్తే
జాతీయ ఈ-కామర్స్ విధానం రూపకల్పనపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూపొందించిన ముసాయిదాపై పది రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సూచించారు. ఇప్పటికే ఈ- కామర్స్, టెక్నాలజీ పరిశ్రమ వర్గాలతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వారు డేటా భద్రత సహా మరికొన్ని అంశాలపై తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అందరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, పరిష్కరించే ప్రయత్నం చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారని, 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా పరిశ్రమ, అంతర్గత వాణిజ్య విధానం ప్రోత్సాహక విభాగానికి (డీపీఐఐటీ) తమ అభిప్రాయాలు తెలపాలంటూ సూచించారని పేర్కొంది.

నిబంధనలను సులభతరం..
కిరాణా స్టోర్స్ ఏర్పాటు చేసుకునే విషయంలో ఇప్పటివరకూ ఉన్న నిబంధనలను సులభతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. మన దేశంలో కిరాణా స్టోర్ ఏర్పాటు చేయాలంటే 28 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే 17 రకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇక నుంచి.. కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటివరకూ ఉన్న నిబంధనలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

సింగిల్ విండో విధానంలో..
చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు నిబంధనలను తగ్గించి, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. లైసెన్స్ రీన్యూవల్ విధానానికి స్వస్తి పలకాలని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) భావిస్తోంది. ఇప్పటికే చైనా, సింగపూర్ వంటి దేశాల్లో రెస్టారెంట్స్ ప్రారంభించాలంటే కేవలం నాలుగు రకాల అనుమతులు పొందితే చాలు. భారత్లో కూడా ఇక నుంచి ఈ తరహా విధానాన్నే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

పబ్లిక్ డేటా ఆఫీస్
దీంతో పాటు ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దుకాణాదారులు, రెస్టారెంట్లు మొదలైనవి కూడా వైఫై సేవలను విక్రయించే వెసులుబాటు తేవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. గతకాలపు పబ్లిక్ ఫోన్ బూత్ల (పీసీవో) తరహాలో ఈ వైఫై సర్వీసులు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వైఫై హాట్స్పాట్స్ను పెంచే క్రమంలో పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో)ల పేరిట వీటిని ఏర్పాటు చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సూచించింది.

ఏదో ఒక రూపంలో..
టెలికం సేవల సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో గతంలో దాన్ని పక్కన పెట్టారు. అయితే, ఏదో ఒక రూపంలో పీడీవో తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ప్రస్తుత సైబర్ కేఫ్ల నిబంధనలకు లోబడి.. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు (పీడీవోఏ) గతకాలపు పీసీవో తరహా సెటప్లో ఇంటర్నెట్ సర్వీసులు విక్రయించే అంశం పరిశీలించవచ్చని ట్రాయ్ సిఫార్సు చేసింది. కానీ, ఇప్పటికే తీవ్ర రుణభారంలో ఉన్న పరిశ్రమపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని, జాతీయ భద్రతకు కూడా ప్రమాదకరమని టెలికం ఆపరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications