18,000 నకిలీ మొబైల్ ఫోన్లను పట్టుకున్నారు!

నకిలీ గుర్తింపు నెంబర్లను కలిగిన 18,000 ఫోన్లను ప్రభుత్వం తాజాగా తమ ఆధీనంలో తీసుకుంది. 15 నెంబర్లతో కూడిన ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ(ఐఎమ్ఇఐ) ప్రతి ఫోన్కు అవసరం. ఈ కోడ్ ఆధారంగానే ఫోన్ అసలు యూజర్ను గుర్తించగలగుతారు. నకిలీ గుర్తింపు నంబర్లు కలిగిన ఫోన్లు అత్యధికంగా బ్లాక్ మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. అత్యధికంగా వీటిని చైనా, తైవాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒకటే ఐఎమ్ఇఐ నెంబర్లను కలిగి ఉంటున్న రెండు ఫోన్లలో ఏది నాణ్యమైనదో.. ఏది నకిలీదో గుర్తించటం కష్టతరంగా మారిందని కేంద్ర సమాచార మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి కపిల్ సిబాల్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించటం విశేషం. నకిలీ ధృవీకరణ నెంబర్లు కలిగిన ఫేక్ మొబైల్ ఫోన్ల అడ్డుకుట్లకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్పప్పటికి లక్షల సంఖ్యలో మార్కెట్లోకి వచ్చి చేరుతున్నాయి.
నకిలీ పత్రాలతో మొబైల్ సిమ్కార్డ్ తీసుకుంటే కఠిన చర్యలే!
నకిలీ పత్రాలతో మొబైల్ సిమ్ కార్డులు తీసుకునే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. రిటైల్ మొబైల్ షాపులు, ఫ్రాంచైజీలకు ఫోర్జరీ పత్రాలను సమర్పించి సిమ్లు కొనుగోలు చేస్తే ఇకపై పోలీసు కేసు నమోదుకానుంది. కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి పరిశీలనపై టెలికం విభాగం(డాట్) విడుదల చేసిన తాజా నిబంధనల్లో ఈ అంశాన్ని చేర్చారు. దీని ప్రకారం… ఎవరైనా మొబైల్ కస్టమర్ సిమ్ల కోసం నకిలీ ధ్రువపత్రాలను ఇవ్వడం, ఒరిజినల్స్ కూడా నకిలీవే అయిన పక్షంలో ఆయా రిటైలర్లు/ఫ్రాంచైజీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఎఫ్ఐఆర్ను నమోదుచేసేలా చూడాలని డాట్ ఆదేశించింది. దీంతోపాటు సంబంధిత టెలికం ఆపరేటర్ దృష్టికి ఈ విషయాన్ని 15 రోజుల్లోగా తెలియజేయాలని కూడా పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ రెండో వారం నుంచి అమల్లోకి రానున్నాయి.
నిబంధనలు ఇవీ…
సిమ్ కార్డులు విక్రయించే అధీకృత వ్యక్తి… కస్టమర్ దరఖాస్తుతో పాటు ఇచ్చిన ఫోటోను సరిపోల్చిచూసినట్లు తెలియజేయాలి. అదేవిధంగా సిమ్ ఎవరిపేరుపై తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని చూసినట్లు కూడా దరఖాస్తులో పేర్కొనాలి.
సిమ్ కోసం సమర్పించిన డాక్యుమెంట్లల్లో అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్స్ను కూడా పరిశీలించినట్లు సంబంధిత దరఖాస్తుపై రిటైలర్ సంతకం కూడా చేయాలి.
ఫోర్జరీ పత్రాలు ఇచ్చిన వారిపై రిటైలర్/ఫ్రాంచైజీలు గనుక ఫిర్యాదు/ఎఫ్ఐఆర్ను దాఖలు చేయకపోతే… సంబంధిత మొబైల్ ఆపరేటర్ స్పందించాల్సి ఉంటుంది. సబ్స్క్రయిబర్తో పాటు రిటైలర్/ఫ్రాంచైజీలపై మూడురోజుల్లోగా ఆపరేటరే పోలీసులకు ఫిర్యాదు లేదా
ఎఫ్ఐఆర్ను నమోదు చేయించాలి.
ఒకవేళ ఫోర్జరీ డాక్యుమెంట్ల విషయంలో అమ్మకందారు, కస్టమర్లపై చర్యలు చేపట్టకపోతే టెలికం ఆపరేటర్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక టెలికం సర్కిల్లో బల్క్ కనెక్షన్లు తీసుకోవడాన్ని కూడా ఇక నిషేధించనున్నారు. 10కి మించి మొబైల్ కనెక్షన్లను(మొత్తం ఆపరేటర్లందరి నుంచీ) పొందే వీలుండదు.


Click it and Unblock the Notifications