డ్రైవింగ్ లైసెన్స్కు ఆధార్ అక్కర్లేదు, చదువు అవసరం లేదు
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని కేంద్రం నిలిపివేసిందని రాజ్యసభకు ఆయన తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 26న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.

ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఆధారంగా దేశ వ్యాప్తంగా 1.57 కోట్ల డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేశామని అన్నారు. ఇదే సమయంలో ఆధార్ ప్రామాణికంగా 1.65 కోట్ల వాహనాలను రిజిస్టర్ చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఆధార్ ను ధ్రువీకరణకు వినియోగించడాన్ని నిలిపివేశామని తెలిపారు.

వాహనాల చట్టానికి సవరణలు
మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మరోసారి బిల్లు ప్రవేశపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి అత్యధిక జరిమానాలు విధించడంతో పాటు ప్రమాద సమయాల్లో సాయం చేసే వారికి రక్షణ కల్పించడం సహా ఇతర నిబంధనలు ఈ సవరణ బిల్లులో ఉన్నాయి. మరింత సులువుగా ఆన్లైన్ లెర్నింగ్ లైసెన్స్ జారీ, ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు త్వరితగతిన బీమా అందేలా నిబంధనలు సడలించడం, ప్రమాదం సమయంలో సాయం చేసే వారికి రక్షణ కల్పించడం వంటి సవరణలు తాజా బిల్లులో ప్రవేశపెట్టారు.

మరింత మంది ప్రాణాలు కాపాడేలా
ఈ బిల్లులో కొన్ని నిబంధనలపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రాష్ట్రాల హక్కులను లాక్కునే ఉద్ధేశ్యం కేంద్ర ప్రభుత్వానికి లేదనీ.. మరింత మంది ప్రాణాలు కాపాడేలా ఈ చట్టాన్ని లోక్సభ ఆమోదించాలని ఆయన కోరారు. గత లోక్సభలోనే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. రాజ్యసభలో గట్టెక్కలేకపోయింది.

రెన్యువల్
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు పెంచడం, డ్రైవింగ్ లైసెన్సును ఒక ఏడాది ముందు లేదా ఆ తర్వాతి ఏడాది లోపు రెన్యువల్ చేసుకునే నిబంధన కూడా ఇందులో ఉంది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే ఈ బిల్లును రూపొందించినట్టు గడ్కరీ పేర్కొన్నారు. ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేయాలా లేదా అన్నది రాష్ట్రాల అభిష్టానికే వదిలేస్తున్నామన్నారు.

తాగి వాహనం నడపాలనుకున్నా..
గడ్కరీ వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 30 శాతానికి పైగా బోగస్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిఏటా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండగా... 5 లక్షల మంది గాయాలపాలవుతున్నారు. వాహనాలు ప్రమాణాలు పాటించడం వల్ల ఢిల్లీలో కాలుష్యం 32 శాతం తగ్గినట్లు మంత్రి చెప్పారు. వాహన లైసెన్సులను నకిలీ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తాగి వాహనం నడపాలనుకున్నా.. ఆ వాహనం కదలని రీతిలో టెక్నాలజీ అభివృద్ధి చెందిన్నట్లు మంత్రి చెప్పారు.

8వ తరగతి నిబంధన ఎత్తివేత
డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం 8వ తరగతి నిబంధనను కూడా ఎత్తివేయబోతున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 8వ తరగతి నిబంధన కారణంగా డ్రైవింగ్లో పూర్తి నైపుణ్యం ఉండి చదువు అంతంత మాత్రంగా వచ్చిన వాళ్లు లైసెన్స్ తీసుకోవాలంటే కుదిరేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, అలాంటివారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చదువుకోకపోయినా లైసెన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications








