AC వినియోగంపై కేంద్రం కీలక నిర్ణయం.. దీని వల్ల మీకు మంచి జరుగుతుందని తెలుసా..?
దేశంలో గతంలో పోలిస్తే విద్యుత్ వినియోగం అధికంగా ఉంటోంది. ముఖ్యంగా వేసవి కాలంలో గరిష్ఠ స్థాయిలో విద్యుత్ వినియోగం ఉంటోంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వాల స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందులో భాగంగా తక్కువ విద్యుత్ తో పనిచేసే బల్బులు పంపిణీ కొన్ని ప్రభుత్వాలు చేపడుతున్నాయి. దీంతోపాటు తక్కువ విద్యుత్తో పనిచేసే విద్యుత్ ఉపకరణాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తోంది.
ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు (AC) భారీగా విద్యుత్ను ఉపయోగిస్తుంటాయి. దీంతో ప్రజలు 5 రేటింగ్తో పనిచేసే AC లు కొనుగోలు చేసి, వినియోగించేలా ఇప్పటికే ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి. పాత AC లు ఎక్స్ఛేంజీ చేసుకొనేలా ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

దీంతోపాటు అధిక విద్యుత్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు వీలుగా AC లను 24 డిగ్రీల వద్ద మాత్రమే వినియోగించేలా యూజర్లలో అవగాహన కల్పిస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ ను ఆదా చేయవచ్చని సూచనలు చేస్తున్నాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక AC లు కనిష్ఠంగా 16 డిగ్రీలు, 18 డిగ్రీల వద్ద పనిచేసేందుకు కూడా అనుకూలంగా ఉన్నాయి. దీంతో అనేక మంది చల్లదనం కోసం 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటోంది.
దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్లాల్ కట్టర్ కీలక ప్రకటన చేశారు. విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు వీలుగా AC టెంపరేచర్ కు నిర్దిష్ట పరిమితి విధించనున్నట్లు చెప్పారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
భవిష్యత్లో వచ్చే AC లను 20 నుంచి 28 డిగ్రీల మధ్య మాత్రమే పనిచేసేలా నిబంధనలు తీసుకొస్తామని చెప్పారు. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే AC వినియోగంపై నిపుణులు అనేక సూచనలు చేశారు. AC లను సాధారణంగా 24 నుంచి 25 డిగ్రీల వద్ద వినియోగిస్తే చాలా వరకు విద్యుత్ను ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎయిర్ కండిషనర్లో ఒక్కో డిగ్రీ సెల్సియస్ ను పెంచుకుంటూ వెళ్తుంటే.. 6 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ చెబుతోంది. ఈ కొత్త నిర్ణయం వల్ల భారీగా విద్యుత్ను ఆదా చేయవచ్చు. దీంతోపాటు తక్కువ డిగ్రీల వద్ద ఏసీని వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది.
ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించి, ఉపయోగించడం వల్ల సరైన పనితీరు కనబరచడంతోపాటు విద్యుత్ ఆదా చేయవచ్చు. నిపుణుల సూచనల ఆధారంగా ప్రతి 600 నుంచి 700 గంటలకు ఒకసారి AC ను సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది.
కొంత మంది ఏసీలను 10 నుంచి 12 గంటలపాటు వినియోగిస్తుంటారు. దీని వల్ల కంప్రెషర్ త్వరగా డ్యామేజీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఏసీ సరైన పనితీరు కనబరిచేందుకు వీలుగా గదిలో సుమారు 7- 8 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలి. ఏసీ ఇన్డోర్ యూనిట్ తోపాటు అవుట్డోర్ యూనిట్ ను కూడా శుభ్రం చేస్తుండాలి.


Click it and Unblock the Notifications








