ఆధార్ లింకింగ్పై కేంద్రం తీపికబురు, 3 నెలలు గడువు పొడిగింపు
ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, దీని గడువు డిసెంబర్ 31తో ముగుస్తుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానిపై మరో చల్లని వార్తను మోసుకొచ్చింది.
ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, దీని గడువు డిసెంబర్ 31తో ముగుస్తుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానిపై మరో చల్లని వార్తను మోసుకొచ్చింది. దీనిని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చునంటూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది.

ఆందోళనకు తాత్కాలిక విరామం
బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు, పాన్, పోస్టాఫీసు ఖాతాలు, బీమా పాలసీలను ఆధార్తో అనుసంధానం చేయకుంటే ఈ నెల 31 తర్వాత తమ ఖాతాలు బ్లాక్ అయిపోతాయని, ఇతరత్రా సేవలు నిలిచిపోతాయని వస్తున్న ఆందోళనకు తాత్కాలిక విరామం లభించింది.

రూ.50,000కు మించిన లావాదేవీలకు..
ప్రభుత్వ గత ఆదేశాలను చూస్తే బ్యాంకుల్లో పాత, కొత్త ఖాతాలకు, రూ.50,000కు మించిన లావాదేవీలకు పాన్, ఆధార్ నంబర్ కోట్ చేయడం తప్పనిసరి. ఇందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 దాకానే గడువు. అయితే ఈ నోటిఫికేషన్ను కేంద్రం ఉపసహరించుకుని దీని స్థానంలో మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఫామ్ 60 సమర్పించేందుకు..
2018 మార్చి 31 లేదా ఖాతాను తెరిచిన తర్వాత ఆరు నెలలు... ఈ రెండింటిలో ఏది ఆలస్యమైతే దానిని ఆధార్ నంబర్, పాన్ లేదా ఫామ్ 60 సమర్పించేందుకు గడువుగా నిర్ణయించామని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది.

తాజా ఆదేశాల్లో..
అయితే తాజా ఆదేశాల్లో కూడా బ్యాంకు ఖాతాలు, పాన్ గురించే తప్ప మిగిలిన వాటిని ప్రస్తావించలేదు. అయినప్పటికీ, మిగిలిన వాటికీ గడువు మార్చి 31గానే అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానాన్ని సవాలు చేస్తూ ..
కాగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఆధార్కు వ్యతిరేకంగా తీర్పు వస్తే గనుక అనుసంధానం కథ కంచికి చేరుతుంది.

అనుసంధానం చేసుకోకపోతే...?
పాన్ కార్డులను ఆదాయపన్ను శాఖ రద్దు చేసే అవకాశం ఉంది.
బ్యాంకులు ఆధార్ నంబర్ సమర్పించని ఖాతాలను బ్లాక్ చేసేస్తాయి. తద్వారా బ్యాంకు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి.
మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో కొత్తగా పెట్టుబడులకు అవకాశం లేకుండా ఫోలియోలను, ఖాతాలను బ్లాక్ చేయడం జరుగుతుంది. దీంతో కొత్తగా షేర్ల కొనుగోలుకు అవకాశం ఉండదు. అప్పటికే ఉన్న షేర్లను విక్రయించేందుకు కూడా వీలు కాదు.
పోస్టాఫీసు పథకాల్లోనూ అంతే. ఖాతాలను నిలిపివేస్తారు.
మొబైల్ సిమ్ కార్డులు పనిచేయవు. ఆధార్ ఇచ్చిన తర్వాతే ఆయా సేవలను పొందేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








