ఇంటర్తో HCLలో ఉద్యోగం సాధించండి, ఎలా జాయిన్ కావాలో తెలుసుకోండి
ప్రముఖ కంపెనీ హెచ్సీఎల్ ఇంటర్ స్టూడెంట్స్ కు గొప్ప అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇంటర్ లో బాగా చదివిన స్టూడెంట్స్ కు హెచ్సీఎల్ లో కోచింగ్ ఇచ్చి , జాబ్ ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. యంగ్ టాలెంట్ను ఒడిసి పట్టుకునేందుకు నేరుగా జూనియర్ కాలేజీల నుంచే రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించింది. బాగా చదివే విద్యార్థులను కాలేజీల్లోనే ఎంపిక చేసుకుని వారిని ట్రైనింగ్ ఇచ్చి ఐటీ ప్రొఫెసనల్స్గా తీర్చిదిద్దనుంది.

సంవత్సరానికి రూ. 1.8 లక్షల వేతనం కూడా ఇస్తారు. ఈ మేరకు హెచ్సీఎల్ మధురైలో పైలెట్ ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించింది. ఇంటర్ పాసైన 100 మంది విద్యార్థులకు తన కోయంబత్తూర్ క్యాంపస్లో శిక్షణ ఇస్తోంది.ఈ విధంగా హెచ్సీఎల్లో ఉద్యోగం పొందాలంటే ఇంటర్లో సైన్స్ గ్రూపుతో కనీసం 85 శాతం మార్కులు ఉండాలి. సీబీఎస్ఈ విద్యార్థులకు 80 శాతం ఉంటే చాలు.

టెక్ బీ కార్యక్రమం
ఇంటర్ విద్యార్థుల కోసం హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) టెక్నాలజీస్ సంస్థ టెక్ బీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ ‘‘టెక్ బీ'' కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

రెండేళ్ల క్రితం
ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా టెక్బీ కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితం చేపట్టామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ వెల్లడించారు.ఇక్కడ మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. ఈ టెక్బీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగాల్లో చేరడంతోపాటు, ఆర్థిక స్వావలంబన సాధించాలని, తద్వారా ట్రెండ్ సెట్టర్స్గా నిలవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ టెక్ బీ కేంద్రాలు ఈ చోటే..
ఈ నేపథ్యంలో దక్షిణాన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోదృష్టిపెట్టనున్నామని, ఉత్తరాన హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ రాష్ట్రాలలో తమ అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయని, అందుకే ఈ టెక్ బీ కేంద్రాలని ప్రారంభించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు.

ప్రాసెసింగ్ ఇదే..
ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా గణితం/ వ్యాపార గణితం ఒక సబ్జెక్టుగా కలిగి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. 2018, 2019 సంవత్సరాల్లో ఇంటర్ పూర్తిచేసి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఈ ఎంపిక ఉంటుంది. ఇలా ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.10వేల స్టైపెండ్ ఇస్తామని ఆమె చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కాల పరిమితి ఒక సంవత్సరం. ఫీజు రూ.2లక్షలు. అయితే దీనికి లోన్ సదుపాయం ఉంది. ఉద్యోగం వచ్చిన తరువాత ఈమొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ఇక్కడ శిక్షణపూర్తి చేసుకున్న విద్యార్థులకు 2.5 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాలుకల్పిస్తామని శివశంకర్ ప్రకటించారు.

700 మంది విద్యార్థులు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫండమెంటల్స్, సాఫ్ట్వేర్ టూల్స్, లైఫ్స్కిల్స్ తదితర అంశాలపై ఈ టెక్ బీ ప్రోగ్రాంలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. మొదటి తొమ్మిది నెలలు తరగతిలో, చివరి మూడు నెలలు ప్రాక్టికల్ పద్ధతిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాక ప్రత్యక్షంగా కంపెనీ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం లభిస్తుంది. శిక్షణ పూర్తిచేసినవారు హెచ్సీఎల్లో ఐటీ ఇంజినర్లుగా ఉద్యోగం పొందుతారు. అలాగే ఈ శిక్షణ అనంతరం బిట్స్ పిలానీ, శస్త్ర (ఎస్ఏఎస్టీఆర్ఏ)లాంటి ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ఉన్నత విద్యా కోర్సుల్లో చేరవచ్చన్నారు. ఇప్పటికే ప్రస్తుతం 700 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తమ కంపెనీలో ఉద్యోగులయ్యారని వెల్లడించారు.

ఎంపిక విధానం ఇదే
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. క్వాంటిటేటివ్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ ఎబిలిటీస్కు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్సీఎల్ కార్యాలయాల వద్ద ప్రతి వారాంతం నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రవేశ ప్రక్రియ 2019 జులై చివరి వరకు జరుగుతుంది.
మరింత సమాచారం కోసం హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఆక్స్ఫర్డ్ హౌస్ ఫోర్త్ఫ్లోర్, రుస్తంబాగ్ లేఅవుట్, మణిపాల్ హాస్పిటల్ పక్కన, బెంగళూరు - 560017, కర్ణాటక చిరునామాలో సంప్రదించవచ్చు.
వెబ్సైట్: www.hcltechbees.com

ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్య
హెచ్సీఎల్లో ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను చదవవచ్చు. బిట్స్ పిలానీ, శస్త్ర యూనివర్సిటీల భాగస్వామ్యంతో డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థలతో హెచ్సీఎల్కు ఒప్పందం ఉంది. బిట్స్ పిలానీలో నాలుగేళ్ల బీఎస్సీ (డిజైనింగ్ అండ్ కంప్యూటింగ్), రెండేళ్ల ఎంఎస్సీ, ఎంటెక్ కోర్సులు చేయవచ్చు. శస్త్ర యూనివర్సిటీ మూడేళ్ల బీసీఏ, ఎంసీఏ ప్రోగ్రాములను అందిస్తోంది. ఉద్యోగులు తమకు నచ్చిన కోర్సు చేసుకోవచ్చు. ఉద్యోగం చేసే ప్రాంతంలోనే తరగతులు ఉంటాయి. చదువుకు అయ్యే ఖర్చు మొత్తం కంపెనీయే భరిస్తుంది.


Click it and Unblock the Notifications