పాన్ ఆధార్ లింక్ చేశారా, 30 వరకే డెడ్లైన్, చేయకుంటే ఇలా చేయండి
ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకున్నారా? ఇంకా లేదా? అయితే డెడ్లైన్ దగ్గరకు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 30 వరకు మీకు గడువు ఉంది. పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి. మీరు రెండింటినీ నిర్ణీత గడువులోగా లింక్ చేసుకోకపోతే ఆదాయపు పన్ను శాఖ మీ పాన్ కార్డును పనిచేయకుండా చేయొచ్చు. ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్ కార్డు ( PAN card) అనేది చాలా అవసరం. పన్ను ఎగవేతదారులకు అడ్డుకట్ట వేయడంలో పాన్ నెంబర్ది కీలక పాత్ర. అందుకే పెద్ద లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలని ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ప్రకారం పాన్కార్డు, ఆధార్కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఇన్కం ట్యాక్స్( Income Tax) రిటర్న్ల ఫైలింగ్కు ఆధార్ నంబర్ కూడా అవసరం. ఈ ప్రాసెస్ కు ఆదాయపు పన్ను శాఖ ఈ నెల 30 వరకు డెడ్ లైన్ విధించింది. పాన్కార్డు లేనివారు ఆధార్తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. పాన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. ఇకపోతే ఐటీఆర్ ఫైలింగ్కు ఇప్పుడు ఆధార్ నెంబర్ కూడా తెలియజేయాలి.ఈ నేపథ్యంలో ఆధార్ సంఖ్యను పాన్కార్డుతో అనుసంధానం ఆన్లైన్లోనూ, ఎస్ఎంఎస్ ద్వారా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలాగో చూద్దాం.

లింక్ చేయడం ఎలా ?
ముందుగా ఆదాయపన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in లో లాగిన్ అయి ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. అక్కడ ఎడమ భాగంలో లింక్ ఆధార్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్కార్డు సంఖ్య, ఆధార్కార్డు సంఖ్య, పేరు వివరాలను పూర్తి చేయాలి. మీరు ఎంటర్ చేసిన తరువాత ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తి అయిన తర్వాత మీ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఇది పూర్తయిన తరువాతే మీకు మెసేజ్ వస్తుంది. అయితే వివరాలు కరెక్ట్ గా లేకుంటే మీ పని జరగదు.

SMS ద్వారా చేయడం ఎలా ?
మీ మొబైల్ నుంచి యూఐడీపీఏఎస్(UIDPAS) అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ ( Aadhaar Number) ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నంబర్( Pan Number) ఎంటర్ చేసి 567678కు ఎస్ఎంఎస్ పంపాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ లో మీరు ఆధార్కార్డు ( Aadhaar card)తో లింక్ అయిన మొబైల్ నంబర్తోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.

అనుసంధానం ఎందుకు ?
ఆదాయపన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు మీ మొబైల్కు వచ్చే OTP మీ ఆధార్ అనుసంధానం అయిన సెల్ నంబర్కు వస్తుంది. దీని ద్వారా ఆ శాఖ ఇ-వెరిఫికేషన్ మరింత సులువవుతుంది. పాన్తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో సెప్టంబర్ 30 తర్వాత పాన్కార్డు నిరుపయోగంగా మారుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఆదాయపన్ను రిటర్న్ చేసేవారు ఆధార్ను పాన్కు అనుసంధానించడం మంచిది. ఇన్కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ అనుసంధానం జరిగి ఉంటే వీరు ఐటీఆర్-5ను ప్రింట్ తీసి పంపాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్ను రిటర్నుల ప్రక్రియ త్వరితగతిన పూర్తి అవుతుంది.

వెబ్సైట్లో లాగిన్ అవ్వడం ఎలా ?
పన్ను చెల్లింపుదారులు ఇన్కం ట్యాక్స్ ఇ-ఫైలింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఇదివరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఇ-ఫైలింగ్ పోర్టర్లో లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యేందుకు గతంలో క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్, కోడ్ నంబర్ను ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన తరువాత ఆధార్, పాన్ సంఖ్యల లింక్ వివరాలు తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications