స్పామ్ కాల్స్, మెసేజ్లతో విసుగెత్తిపోయారా.. ఇటీవల విడుదలైన సంచార్ సాథీ యాప్ గురించి తెలుసుకోండి..!
మొబైల్ యూజర్లకు ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్, మెసేజ్ ల సమస్య ఎక్కువైంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దీంతో టెలికాం మంత్రిత్వ శాఖ తో (DoT) పాటు టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా టెలికాం సంస్థలకు స్పామ్ కాల్స్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
దీంతోపాటు ఇటీవలే కాలర్ ఐడీ నేమ్ ప్రజంటేషన్ (CNAP) వ్యవస్థను వెంటనే అందుబాటులోకి టెలికాం సంస్థలకు ట్రాయ్ ఇటీవల స్పష్టం చేసింది. ఇప్పటికే కొన్ని నెలలుగా ఈ వ్యవస్థను టెస్టింగ్ చేస్తున్నారు. దీని ద్వారా సేవ్ చేయని నంబర్ల నుంచి కాల్ వచ్చినా.. వారి పేర్లు ఫోన్ డిస్ప్లే పైన కనిపించనున్నాయి.

సిమ్ కార్డు కొనుగోలు చేసిన సమయంలో సమర్పించిన గుర్తింపు కార్డులోని పేర్లు కనిపిస్తాయి. ఫలితంగా తెలియని నంబర్ల నుంచి కాల్ వచ్చినా మీరు సులభంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు టెలికాం శాఖ సిమ్ కార్డుల జారీకి కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆధార్ కార్డు ద్వారా మాత్రమే సిమ్ కార్డు తీసుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు సంబంధిత వ్యక్తి బయో మెట్రిక్ ద్వారా మాత్రమే సిమ్ కార్డు జారీ చేస్తారు.
అయితే తాజాగా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) సరికొత్త యాప్ను విడుదల చేసింది. సంచార్ సాథీ మొబైల్ యాప్ను (Sanchar Saathi App) తీసుకొచ్చింది. దీని ద్వారా స్పామ్ కాల్స్ను బ్లాక్ చేయడం సహా వాటిపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ఈ యాప్ను లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ వెబ్సైట్ అందుబాటులో ఉండగా.. తాజాగా ఆండ్రాయిడ్, iOS యూజర్లకు యాప్ అందుబాటులోకి వచ్చింది.
సంచార్ సాథీ యాప్ ఉపయోగాలు :
అయితే సంచార్ సాథీ యాప్తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఫోన్ దొంగలించబడినా లేదా ఎక్కడైనా పొగొట్టుకున్నా.. ఈ యాప్ ద్వారా ఫోన్ను బ్లాక్ చేయవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్సెట్ను ఇతరులు ఎవరూ ఉపయోగించలేదు. అయితే మీ ఫోన్ రికవరీ అయితే, ఈ యాప్ నుంచే అన్బ్లాక్ చేసుకోవచ్చు.
దీంతోపాటు ఈ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు జారీచేయబడ్డాయో ఈ యాప్తో తెలుసుకొనేందుకు అవకాశం ఉంది. మీకు సంబంధం లేని మరియు వినియోగంలో లేని ఫోన్ నంబర్లపై సంచార్ సాథీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత వర్గాలు మీ ఫిర్యాదును పరిశీలించి బ్లాక్ చేయనున్నారు.
ముఖ్యంగా స్పామ్ కాల్స్, మెసేజ్లు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. దీంతో అనేక మంది ప్రజలు మోసపోతున్నారు. సంచార్ సాథీ యాప్ ద్వారా ఈ తరహా కాల్స్, మెసేజ్లపై ఫిర్యాదు చేయవచ్చు. మరియు ఆ నంబర్లను బ్లాక్ చేయవచ్చు.
ప్రస్తుతం సిమ్ కార్డుల ద్వారా ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఆఫర్లు, లాటరీల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇతరుల పేర్లతో సిమ్ కార్డులు తీసుకొని మోసాలు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తరహా ఘటనల పట్ల టెలికాం శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న సిమ్ కార్డులను బ్లాక్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








