ఇన్స్టాగ్రామ్లో జోరుగా పుర్రెల వ్యాపారం, అంతా లక్షల్లోనే..
ఈ కామర్స్ ఫ్లాట్ పాం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. అనేక రకాలైన వస్తువులు ఈ కామర్స్ మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. అమ్మకందారులు తమ తయారీ ఉత్పత్తులతో సోషల్ మీడియా వేదికగా అలాగే ఈ కామర్స్ వేదికగా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. కొనుగోలు దారులు కూడా నేరుగా షాపుకెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉన్నా వారు ఈ కామర్స్ మార్కెట్ల ద్వారా ఆన్ లైన్ లో కొనేస్తున్నారు. వారు నేరుగా ఇంటికి ఉత్పత్తులను తీసుకురావడంతో ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది.

అయితే దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు సరికొత్త ఉత్పత్తులను ఆన్ లైన్ లో పెడుతున్నారు. మనిషి పుర్రెలు, అలాగే ఎముకలు మార్కెట్లోకి అమ్మకానికి వచ్చేశాయి. నమ్మలేకున్నా ఈ వార్త నిజం. ఇన్స్టాగ్రామ్లో పుర్రెల వ్యాపారం ఇప్పుడు జోరుగా సాగుతోంది.

సన్ రిపోర్ట్ ప్రకారం
సాధారణంగా సోషల్ మీడియాలో బట్టలు, షూస్, యాక్సెసరీస్ వంటి వాటిని కొంటుంటారు. అంతేగాని ఏ పుర్రెలో, ఎముకలో కొనుక్కోరు కదా.. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. ఇన్స్టాగ్రామ్లో పుర్రెల అమ్మకం జోరుగా సాగుతోంది.ది సన్ రిపోర్ట్ ప్రకారం ఇన్స్టాగ్రామ్లో కొన్ని అకౌంట్లు ప్రత్యేకించి పుర్రెల్ని అమ్ముతున్నాయి.

బ్రిటన్లో ఈ వ్యాపారం
అయితే ఇవి అమ్మేది ఇండియాలోనో అమెరికాలోనో కాదు. బ్రిటన్లో ఈ వ్యాపారం సాగుతోంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే అక్కడ కస్టమర్లు కూడా పుర్రెల్ని కొనేందుకు ఎంత డబ్బైనా చెల్లిస్తున్నారట. వారు ఆన్ లైన్ లో నచ్చినదాన్ని సెలక్ట్ చేసుకుంటే దానికి ఎంత రేటైనా వారు చెల్లిస్తున్నారట.
అయితే ఇవి ఎవరు కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు అనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. సైంటిఫిక్ టెస్టుల కోసం, మెడికల్ స్టడీస్ కోసం... ఇలా రకరకాల కారణాలతో పుర్రెల్ని కొంటున్నారు. కొనేవాళ్లలో ఎక్కువ శాతం డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారని సమాచారం.

నిషేధం లేదు
ఇదిలా ఉంటే బ్రిటన్లో మనుషుల పుర్రెలు, ఎముకలు అమ్మడంపై నిషేధం లేదు. అక్కడ యధేచ్చగా కొనుగోలు అమ్మకాలు జరపవచ్చు. ఈ పుర్రెల్ని మొదట్లో "ఈబే"లో కొనేవారు. ఆ సైట్ మూతపడటంతో ప్రజలు ఇన్స్టాగ్రామ్ వైపు ఆసక్తి చూస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్లో 34వేల ఫాలోయర్లు
కాగా ఈ పుర్రెల అమ్మకం దారులు #skeleton అనే హ్యాష్ ట్యాగ్ వాడుతున్నారు. పుర్రె ధరను కామెంట్లలో రాస్తున్నారు.హెన్రీ స్క్రాగ్ అనే పుర్రెల వ్యాపారికి ఇన్స్టాగ్రామ్లో 34వేల ఫాలోయర్లు ఉన్నారు. పుర్రెలు కొనేవారు అమ్మేవారికి పర్సనల్ మెసేజ్ పెడుతున్నారు. తద్వారా డీల్ కుదురుతోంది. ప్యాకేజింగ్, షిప్పింగ్ ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు.

ఏడాదికి రూ.70లక్షల రూపాయల పుర్రెల వ్యాపారం
బ్రిటన్లో ఏడాదికి రూ.40లక్షల రూపాయల పుర్రెల బిజినెస్ జరుగుతోంది. ఏటా ఇది పెరుగుతోంది. గత రెండేళ్లలో ఇది మరింత పెరిగింది. ప్రస్తుతం ఏడాదికి రూ.70 లక్షల పుర్రెల వ్యాపారం జరుగుతోంది. ఇది రానున్న కాలంలో ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని డిమాండ్ ను బట్టి తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








