IIT మద్రాస్తో భారత ఆర్మీ విభాగం (MCTE) కీలక భాగస్వామ్యం..!
దేశ రక్షణలో సాంకేతికత వినియోగానికి భారత ఆర్మీ ప్రాధాన్యం ఇస్తోంది. ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది. భారత ఆర్మీకి చెందిన మిలిటరీ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE) విభాగం ఐఐటీ మద్రాస్తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇండోర్లోని మిలిటరీ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE) కేంద్రం వద్ద 5G టెస్ట్ బెడ్ ఏర్పాటు చేసేందుకు ఐఐటీ మద్రాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం 5G కమ్యూనికేషన్స్ మరియు మిలిటరీ అప్లికేషన్ల అభివృద్ధిలో పరిశోధనలు చేపట్టేందుకు విద్యార్థులు, ఫ్యాకల్టీలు మరియు శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుందని ఇన్స్టిట్యూట్ విశ్వసిస్తోంది. దీని ఫలితంగా భారత సరిహద్దుల్లో ఆర్మీకి 5జీ సాంకేతికత విస్తృతంగా ఉపయోగంలోకి రానుంది.
ఈ భాగస్వామ్యానికి సంబంధించి సంబంధిత అధికారులు Memorandum Of Understanding(MoU) పై సోమవారం సంతకాలు చేశారు. ఇందులో షిమ్లా ఆర్మీ ట్రైనింగ్ కేంద్రం అధికారులు, ఐఐటీ మద్రాస్ అధికారులు పాల్గొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్స్టిట్యూట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ 5G టెస్ట్బెడ్ ప్రాజెక్ట్ తో ప్రయోజనాలు..
ఇన్స్టిట్యూట్ అధికారులు ప్రకటనలో వెల్లడించిన ప్రకారం.. ఈ సహకారం సముచిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవస్థలు, పరికరాలు మరియు భారత సాయుధ దళాల సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా AI- ఆధారిత అల్గారిథమ్ల వినియోగానికి తోడ్పాటును ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనికేషన్ రంగాలలో "ఆత్మనిర్భరత" సాధించడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతో పాటు సైన్యం యొక్క స్వదేశీ ప్రయత్నాలను వేగవంతం చేయడం మరియు త్రివిధ సేనలకు పరీక్షా సౌకర్యాన్ని అందించడం కూడా దీని ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు. భవిష్యత్తు లో కమ్యూనికేషన్ పరంగా 5జీ సాంకేతికత పరిశోధనలు, అభివృద్ధికి ఐఐటీ మద్రాస్ సహకారం అందించనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులు, శిక్షణలో ఉన్న వారు 5జీ సాంకేతికతను అర్థం చేసుకోవడం సులువుగా ఉంటుందన్నారు.
అంతేకాకుండా, సైన్యంతో ఈ భాగస్వామ్యం 5G కమ్యూనికేషన్స్ మరియు మిలిటరీ అప్లికేషన్ల అభివృద్ధిలో పరిశోధనలు చేపట్టేందుకు విద్యార్థులు, ఫ్యాకల్టీలు మరియు శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుందని ఇన్స్టిట్యూట్ విశ్వసిస్తోంది. 5జీ టెక్నాలజీ వంటి అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఆర్మీకి ఎంతో కీలకం అని వారు తెలిపారు.

5G స్పెక్ట్రమ్ వేలం ..
కాగా జూలై చివరి నాటికి నిర్వహించే 5G స్పెక్ట్రమ్ (4G కంటే 10 రెట్లు వేగంగా) వేలం నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మొత్తం 72 GHz (గిగాహెర్ట్జ్) స్పెక్ట్రమ్ - 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో - వేలానికి ఉంచబడుతుంది. అయితే ఆ 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రమ్ తమకు మాత్రమే ఇవ్వాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) మరోసారి ప్రభుత్వాన్ని కోరింది. ఈ సీఓఏఐలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ఒకవేళ సొంత అవసరాల కోసం టెక్ కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయిస్తే వారి నుంచీ లైసెన్స్ ఫీజు, జీఎస్టీ వసూలు చేయాలని కోరింది. అప్పుడే అందరికీ సమాన అవకాశాలు ఏర్పడతాయని తెలిపింది. టెలికాం శాఖ కార్యదర్శి కే రాజారామన్కు సీఓఏఐ ఈ మేరకు ఒక లేఖ రాసింది.

5G టెక్నాలజీ రాకతో కలిగే మార్పులు
దేశంలో 5G సేవలు సేవలు అందుబాటులోకి వస్తే టెక్నాలజీలో పలు మార్పులు రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G కంటే ఇది దాదాపు 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ ని పొందవచ్చు. 5G దేశంలో పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తరువాత దేశం యొక్క ఆర్థిక వృద్ధి తదుపరి స్థాయికి తీసుకొనిపోవడానికి సహాయపడుతుంది. 5G ఆవిష్కరణతో మొమెంటం పనితీరు, ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్వర్క్ స్లైసింగ్ మరియు సెక్యూరిటీ వంటి విభిన్న సామర్ధ్యాలు పెరగనున్నాయి.


Click it and Unblock the Notifications