గుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ.. అక్కడ కూడా UPI చెల్లింపులు చేయవచ్చు
భారత్లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. క్రమంగా దేశం నగదు రహిత లావాదేవీల వైపు వెళ్తోంది. అయితే UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ విస్తరణకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక చర్యలు తీసుకుంటోంది. భారత్ సహా ప్రపంచంలోనే పలు దేశాల్లో యూపీఐను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కీలక ప్రయత్నాలు చేస్తోంది.
రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. పారిస్లోని ప్రవాస భారతీయులతో గురువారం సమావేశం అయ్యారు. భారత్లో సక్రమంగా అమలవుతున్న యూపీఐ వ్యవస్థ ఫ్రాన్స్లోనూ ప్రారంభం కానుందని వెల్లడించారు. UPIను వినియోగించుకొనేందుకు భారత్, ఫ్రాన్స్ అంగీకరించాయని తెలిపారు. త్వరలో ఈ వ్యవస్థ ఈఫిల్ టవర్ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. యూపీఐ అభివృద్ధికి ఈ నిర్ణయం మరింత ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు.

ఈ నిర్ణయంతో ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ వద్దకు వచ్చే భారత పర్యటకులు త్వరలో రూపాయల్లోనే చెల్లింపులు చేయవచ్చని వెల్లడించారు. భారత్ యూపీఐ లేదా ఇతర డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫాంలు.. గణనీయమైన రీతిలో సామాజిక మార్పును తీసుకువచ్చాయని మోడీ తెలిపారు. ఈ అంశంలో భారత్, ఫ్రాన్స్ ఒకే దిశలో పయనిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
భారత్, ఫ్రాన్స్ యూపీఐని ఉపయోగించేందుకు నిర్ణయించాయని, త్వరలో ఈఫిల్ టవర్ వద్ద నుంచి త్వరలో ఇది అమల్లోకి వస్తుందన్నారు. భారత యాత్రికులు రూపాయల్లోనే చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఒప్పందం అనంతరం తాను వెళ్లిపోతానని, కానీ దీనిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని మోడీ సూచించారు.
వచ్చే 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మోడీ వెల్లడించారు. పెట్టుబడులకు భారత్లో చాలా అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు సౌకర్యాలు, భద్రతను కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏ దేశమైనా భారతీయుల భద్రతకు ముందుంటామని హామీ ఇచ్చారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 21 బ్యాంకులతో కలిసి 2016 ఏప్రిల్లో UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్లో ప్రస్తుతం యూపీఐ విజయవంతంగా అమలవుతోంది. యూఏఈ, భూటాన్, నేపాల్ సహా మరిన్ని దేశాల్లోనూ యూపీఐ సర్వీసులు కొనసాగుతున్నాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఫ్రాన్స్కు చెందిన ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ లైరాతో 2022లో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్ - యూపీఐ మరియు సింగపూర్-పేనౌ పైన రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. యూపీఐను మరింత విస్తరించేందుకు అమెరికా, యూరప్ మరియు పశ్చిమ ఆసియాలోనే ఇదర దేశాలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్చలు జరుపుతోంది.
భారత రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 139.2 ట్రిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2022 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన మొత్తం నగదు రహిత లావాదేవీలలో ఇవి 73 శాతం ఉన్నాయి. PwC నివేదిక 2026-27 నాటికి రోజువారీ లావాదేవీలు 1 బిలియన్ వరకు చేరుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం లావాదేవీల్లో ఇది 90 శాతంగా ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








