భారత ప్రభుత్వం 22 యూట్యూబ్ ఛానెల్లను బ్లాక్ చేసింది!! కారణం ఏమిటో తెలుసా?
యూట్యూబ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఖాళీ సమయాలలో ప్రతి ఒక్కరు వినోదం కోసం యూట్యూబ్ ను ఆశ్రయిస్తున్నారు. అలాగే ఎవరైనా తమ యొక్క బిజినెస్ లను ప్రచారం చేయడానికి కూడా ముందుగా యూట్యూబ్ ను ఎన్నుకుంటారు. ముఖ్యంగా కొత్త సినిమాలను ప్రమోషన్ చేయడానికి యూట్యూబ్ మొదటి స్థానంలో ఉంది. అయితే వీక్షకులను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో 22 యూట్యూబ్ ఛానెల్లను బ్లాక్ చేయాలని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. బ్లాక్ చేయనున్న వాటిలో నాలుగు ఛానెల్లు పాకిస్థాన్కు చెందినవి ఉండడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చిన ఐటి రూల్స్ ప్రకారం 2021 నోటిఫికేషన్ తర్వాత భారతీయ యూట్యూబ్ ఛానెల్లపై చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి.

22 యూట్యూబ్ ఛానెల్లు, మూడు ట్విట్టర్ అకౌంటులు, ఫేస్బుక్ అకౌంట్ ఒకటి మరియు ఒక వార్తా వెబ్సైట్ను బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, భారతదేశ సమగ్రత మరియు పబ్లిక్ ఆర్డర్ మొదలైన వాటికి సంబంధించిన కారణాలతో 78 యూట్యూబ్ న్యూస్ ఛానెల్లు మరియు ఇతర సోషల్ మీడియా అకౌంటులను బ్లాక్ చేయడానికి భారతీయ మంత్రిత్వ శాఖ 2021 డిసెంబర్ నుండి ఆదేశాలు జారీ చేసింది.

ఇండియా గవర్నమెంట్ బ్లాక్ చేయడానికి నిర్ణయించిన యూట్యూబ్ ఛానెల్ల యొక్క వీక్షకుల సంఖ్య 260 కోట్లకు పైగా ఉందని మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వారు జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు ప్రజల యొక్క సున్నితమైన విషయాలపై సోషల్ మీడియాలో నకిలీ వార్తలను మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.

ఇటీవలి బ్లాకింగ్ ఆర్డర్ ద్వారా 18 భారతీయ మరియు నాలుగు పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ న్యూస్ ఛానెల్లు బ్లాక్ చేయబడ్డాయి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే "భారత సాయుధ దళాలు, జమ్మూ మరియు కాశ్మీర్ మొదలైన విషయాలపై నకిలీ వార్తలను" పోస్ట్ చేయడానికి బహుళ యూట్యూబ్ ఛానెల్లు ఉపయోగించబడ్డాయి అని ప్రత్యేకంగా తెలిపింది. అలాగే ఉక్రెయిన్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి భారతీయ యూట్యూబ్ ఛానెల్లు తప్పుడు కంటెంట్ను ప్రచురించాయని మరియు ఇతర దేశాలతో ఇండియా యొక్క సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో ఉన్నాయని గమనించబడింది అని పేర్కొంది.

బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్లలో కొన్ని న్యూస్ టీవీ ఛానెల్ల టెంప్లేట్లు మరియు లోగోలను ఉపయోగించడంతో పాటుగా వాటి న్యూస్ యాంకర్లతో సహా వీక్షకులను తప్పుదోవ పట్టించేలా వార్తలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సోషల్ మీడియాలో కంటెంట్ యొక్క వైరల్ని పెంచడానికి థంబ్నెయిల్లు ఉపయోగించబడ్డాయి. అంతేకాకుండా వీడియోల టైటిల్ మరియు థంబ్నెయిల్ తరచుగా మార్చబడ్డాయి. కొన్ని సందర్భాల్లో భారతదేశ వ్యతిరేక నకిలీ వార్తలు పాకిస్తాన్ నుండి ఉద్భవించాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications