స్మార్ట్ మీటర్స్ వచ్చేస్తున్నాయ్, ఓ లుక్కేసుకోండి
ఇండియాలో చాలా రంగాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా ఎలక్ట్రిసిటీ రంగం మాత్రం వెనుకబడి ఉందనే చెప్పవచ్చు. అయితే దీన్ని కూడా ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నడు బిగించింది. పవర్ సెక్టార్ని పవర్ఫుల్లుగా మార్చేందుకు రెడీ అవుతోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ద్వారా ఇండియాలోని అన్ని ఎలక్ట్రిసిటీ మీటర్లనూ... స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చేయాలని నిర్ణయించుకుంది. 2022 నాటికల్లా ఈ పని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. దేశమంతా 24 గంటలూ ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉండాలని, ఒకటే పవర్ గ్రిడ్ ఉండాలనీ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయించింది.

పోస్ట్పెయిడ్ విధానంలో బిల్లులు దిశగా అడుగులు వెయ్యాలంటే... స్మార్ట్ మీటర్లను తేవడమే మంచిదనే వాదన వినిపించింది. స్మార్ట్ మీటర్ల వల్ల మీటర్లతో మనుషులకు పని భారం తగ్గే అవకాశం ఉంది. వాటి మీటర్ను చెక్ చెయ్యడం, బిల్లు వెయ్యడం, మనీ కలెక్ట్ చెయ్యడం వంటి పనులు ఇకపై ఉండవు. స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లు ఎంతో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు, ఎంత కరెంటు వాడుతున్నదీ క్షణాల్లో తెలిసిపోతుంది. ఎంత కరెంటు వాడుకోవాలో... అంతకు సరిపడా ముందే ప్రీపెయిడ్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్పెయిడ్ విధానంలో బిల్లులు పే చెయ్యవచ్చు
ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల వల్ల చాలా చోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోంది. దాని వల్ల డిస్కంలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. వాటి వల్ల బ్యాంకింగ్ రంగంపైనా వ్యతిరేక ప్రభావం పడుతోంది. ఎలక్ట్రిసిటీ రంగంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. పైగా... వినియోగదారులు కూడా... ఎలక్ట్రిసిటీని సమర్థంగా వాడుకునేందుకు వీలవుతుంది. ఒక్కొక్కటీ రూ.6వేలు ఉండే స్మార్ట్ మీటర్లను ఉచితంగానే ఇస్తారని తెలుస్తోంది.

స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు వచ్చేస్తే... ప్రజలు ఏ సంస్థ నుంచీ ఎంత ఎలక్ట్రిసిటీ కొనుక్కోవాలనుకుంటున్నారో, వాళ్లే డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ప్రీపెయిడ్ మొబైల్ టారిఫ్లు వేసుకుంటున్నట్లుగా... కరెంటు వాడకానికి కూడా ముందుగానే ప్రీపెయిడ్ చెల్లింపులు చేస్తారు. అందువల్ల బిల్లులు పెండింగ్ అవ్వవు అని డిస్కంలు చెబుతున్నాయి
ప్రస్తుతం ఉన్న విధానంలో వినియోగదారులు వాడకంతో సంబంధం లేకుండా ప్రతీ నెలా బిల్లును చెల్లించాల్సి వస్తోంది. ఈ కొత్త విధానంలో విద్యుత్ మీటర్లను మొబైల్ ఫోన్ల రీచార్జ్ తరహాలో వాడుకోవచ్చు. దీనివల్ల విద్యుత్ ఆదా అవ్వడంతో పాటు, సామాన్యులకు అదనపు భారం కూడా తప్పుతుంది. అంతే కాకుండా విద్యుత్ సరఫరా నష్టాలు, బిల్లుల ఎగవేతలు తగ్గుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు కారణంగా నైపుణ్యమున్న యువతకు ఉపాధి కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








