సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ - ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-in) హై అలెర్ట్ జారీ చేసింది. ఆపిల్ iOS మరియు ఐప్యాడ్ OS పరికరాల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ రెండు OS లలో అనేక లోపాలను గుర్తించినట్లు తెలిపింది. వీటి ద్వారా ఆయా పరికరాలపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఫలితంగా ఆయా పరికరాలు పనిచేయకుండా చేసే అవకాశం ఉందని మరియు కీలక సమాచారం దొంగిలించే అవకాశం ఉందని పేర్కొంది. ఆపిల్ iOS, ఐప్యాడ్OS 16.76 కంటే ముందు వెర్షన్లపై పనిచేసే ఐఫోన్8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐప్యాడ్ 5వ జనరేషన్, 9.7 అంగుళాల ఐప్యాడ్ ప్రో, 12.9 అంగుళాల తొలి జనరేషన్ ఐప్యాడ్ ప్రోలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

దీంతోపాటు V17.4 వెర్షన్ కంటే ముందు వెర్షన్లయిన ఐఫోన్ XS, 12.9 అంగుళాల రెండో తరం ఐప్యాడ్ ప్రో, 10.5 అంగుళాల ఐప్యాడ్ ప్రో, 11 అంగుళాల తొలి జనరేషన్ ఐప్యాడ్ ప్రో, మూడో తరం ఐప్యాడ్ ఎయిర్, 6వ జనరేషన్ ఐప్యాడ్లు, 5వ జనరేషన్ మిని ఐప్యాడ్లు ప్రభావితం అయ్యే జాబితాలో ఉన్నాయని అప్రమత్తం చేసింది.
ఈ లోపాల కారణంగా బ్లూటూత్, మీడియా రిమోట్, ఫోటోలు, సఫారీ మరియు వెబ్కిట్ వంటివి ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతోపాటు కొన్ని భద్రతా సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఎక్స్టెన్షన్ కిట్, మెసెజ్, షేర్ షీట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరియు లాక్ స్క్రీన్, కోర్క్రిప్టో సమయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
సెక్యూరిటీ ప్యాచ్ల ఇన్స్టాల్ : ఈ సమస్యల నుంచి వెంటనే బయటపడేందుకు iOS, ఐప్యాడ్OS లు లేటెస్ట్ వెర్షన్ కు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆపిల్ సంస్థ అందిస్తోన్న సెక్యూరిటీ ప్యాచ్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ నెట్వర్క్ల ఇంటర్నెట్ వినియోగాన్ని నిలిపేయడం మంచిది.
తమ పరికరాలకు మరింత భద్రతను కల్పించేందుకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను యాక్టివేట్ చేసుకోవాలి. ఆపిల్ స్టోర్ నుంచి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా ఫోన్ డేటాను బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వంటి సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి వచ్చిన హెచ్చరికలపై అప్రమత్తంగా వ్యవహరించాలి.
** తాజాగా గూగుల్ సరికొత్త సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మాల్వేర్ అటాక్ సహా సైబర్ అటాక్ల సమయంలో వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానుంది.
ఆన్లైన్ భద్రత ప్రస్తుతం పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో గూగుల్ తాజా ఫీచర్ వినియోగదారులకు మెరుగైన భద్రతను కల్పిస్తుంది. ఈ ఫీచర్ ప్రధానంగా ఫిష్సింగ్, మాల్వేర్ అటాక్ లపై దృష్టిపెడుతుందని తెలిపింది. వెబ్సైట్లను సందర్శించే సమయంలో అప్రమత్తం చేస్తుంది. 25 శాతం ఫిష్సింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు గూగుల్ తెలిపింది. రియల్ టైం ట్రాకింగ్ మెరుగ్గా పనిచేస్తుందని గూగుల్ భావిస్తోంది.
గూగుల్ సంస్థ తన ట్రాకింగ్ మెకానిజాన్ని రియల్టైం ఫంక్షన్తో అనుసంధానం చేసింది. ఫలితంగా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. మీరు ఏదైనా వెబ్సైట్ను సందర్శించినప్పుడు క్యాచీ ఆధారంగా వెబ్సైట్ భద్రతను టెస్టింగ్ చేస్తుంది. ఆ వెబ్సైట్ URL ను ప్రైవసీ సర్వర్కు పంపించి రియల్ టైంలోనూ భద్రతను పర్యవేక్షిస్తుంది.
అనంతరం ఆ URL తన డేటాబేస్ లో ఉంటే, ముందస్తుగా అప్రమత్తం చేస్తుంది. అయితే ఇందుకు ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం లేదని తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్లోనే వెబ్సైట్ భద్రతను గూగుల్ తనిఖీ చేస్తుందని, ఎటువంటి భద్రతా లోపాలు గుర్తించినా వెంటనే వినియోగదారులను అప్రమత్తం చేస్తుందని తెలిపింది.


Click it and Unblock the Notifications







