ఇకపై ఒక్కొక్కరికీ 18 మొబైల్ కనెక్షన్లు, DoT సంచలన నిర్ణయం
మొబైల్ యూజర్లు పాత నెట్వర్క్ సమస్యగా ఉందని భావించి కొత్త నెట్వర్క్లోకి మారేందుకు ఆసక్తి చూపినప్పుడు వారు తప్పనిసరిగా కొత్త సిమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మొబైల్ యూజర్లు పాత నెట్వర్క్ సమస్యగా ఉందని భావించి కొత్త నెట్వర్క్లోకి మారేందుకు ఆసక్తి చూపినప్పుడు వారు తప్పనిసరిగా కొత్త సిమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండా కొత్త మార్గదర్శకాలను Department of Telecom తీసుకొచ్చింది. ఈ మార్గదర్శకాల ప్రకారం మొబైల్ యూజర్ సిమ్ మార్చుకోకుండానే కొత్త నెట్వర్క్లోకి వెళ్లవచ్చు. ఇలా 18 సిమ్ కనెక్షన్ల వరకు అవకాశం ఇస్తూ DoT సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా ఈసిమ్ రూపంలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను ఓ సారి పరిశీలిస్తే..

నెట్ వర్క్ మారాలనుకున్నప్పుడల్లా..
మొబైల్ యూజర్లు తమ డివైస్లో ఈ సిమ్ని ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇన్స్టాల్ అయిన తరువాత మీరు సర్వీసు ప్రొవైడర్ వివరాలు అందులో అప్ డేట్ చేయాలి. మీరు నెట్ వర్క్ మారాలనుకున్నప్పుడల్లా సిమ్ వివరాలు అలాగే సర్వీసు ప్రొవైడర్ లాంటి వివరాలు అందులో అప్ డేట్ చేస్తే సరిపోతుంది. ఇలా 18 సార్లు వరకు చేసుకోవచ్చు.

మెషీన్-టు-మెషీన్ (ఎం2ఎం) కమ్యూనికేషన్స్లో..
కారులో ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు, కారు దొంగతనానికి గురైనప్పుడు, రిమోట్ కంట్రోల్ తదితర వాటికి సంబంధించి వెహికల్ నుంచి మొబైల్కు వచ్చే అలర్ట్స్ వంటి మెషీన్-టు-మెషీన్ (ఎం2ఎం) కమ్యూనికేషన్స్లో వినియోగించే సిమ్లకు కూడా నిబంధనలు విడుదల చేసింది.

పరిమితిని 9 నుంచి 18కి..
ఎం2ఎం కమ్యూనికేషన్స్కు వినియోగించే సిమ్లకు 13 అంకెలు ఉంటాయని డాట్ గతంలోనే తెలియజేసింది. ఎం2ఎం కమ్యూనికేషన్స్కు ఎక్కువ సిమ్ కార్డులు అవసరమౌతాయి. అందువల్ల డాట్ ఒక్కొక్కరికి మొబైల్ కనెక్షన్ల(సిమ్ కార్డులు) పరిమితిని 9 నుంచి 18కి పెంచింది.

మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్స్ కోసం..
వీటిలో సాధారణ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్స్ కోసం 9 సిమ్లను, మరో 9 సిమ్లను ఎం2ఎం కమ్యూనికేషన్ సేవలకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ డివైస్లో ఎం2ఎం సిమ్ను ప్రి-ఇన్స్టాల్ చేయవలసి వస్తే, అప్పుడు సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ను డివైజ్ తయారీ సంస్థలే పూర్తి చేయాలని డాట్ తెలిపింది.

మొబైల్ నెంబర్ పోర్ట్బిలిటీ..
ఇక ఇ-సిమ్లో మొబైల్ నెంబర్ పోర్ట్బిలిటీ కోసం ఓవర్ ద ఎయిర్ సబ్స్క్రిప్షన్ అప్డేట్ ఫెసిలిటీ కల్పించింది. ఇ-సిమ్పై సర్వీసులు అందించే టెలికం ఆపరేటర్లు వాటిపై తగిన పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించింది.

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలు..
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలు ఆపిల్ వాచ్ సిరీస్-3 విక్రయాలను ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత డాట్ ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం. ఈ వాచ్లలో ఇ-సిమ్ ఉంటుంది. యూజర్లు వీటిని మొబైల్లోని సిమ్తో కనెక్ట్ చేసుకోవాలి. తద్వారా ఫోన్లోని సర్వీస్ ప్రొవైడర్ సేవలను పొందొచ్చు.

ఆధునిక సాంకేతిక అవసరాలను తీర్చడానికి ..
ఎం2ఎం/ఐఓటీలో ఆధునిక సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఇ-సిమ్ (ఎంబెడెడ్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్) వినియోగానికి అనుమతినిస్తున్నట్లు డాట్ తెలిపింది. ఇ-సిమ్ను డివైజ్లలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్వీస్ మార్చినప్పుడు, కొత్త సర్వీసు తీసుకోవాలనుకున్న ప్రతీసారి ఇందులో సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది.


Click it and Unblock the Notifications








