రైల్వే షాకింగ్ నిర్ణయం.. జనరల్ టికెట్ ప్రయాణికులకు ఇక చుక్కలే..?
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఉంది. ప్రతిరోజు వేల రైళ్లు.. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే గతంతో పోలిస్తే రైల్వేల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. దీంతోపాటు రైళ్ల గరిష్ట వేగం కూడా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ట్రాక్లను అప్గ్రేడ్ చేస్తున్నారు.
రైల్వేలో వివిధ సేవల కోసం ప్రస్తుతం వివిధ యాప్లు, వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఆయా అవసరాల కోసం ప్రయాణికులు వాటికి ఉపయోగించాల్సి వస్తోంది. టికెట్ల బుకింగ్ నుంచి ట్రైయిన్ ట్రాకింగ్, ఫిర్యాదులు సహా ఇతర అవసరాల కోసం ఒకే యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది.

రైల్వే కీలక నిర్ణయం :
అయితే తాజాగా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్లలో కీలక మార్పులు చేసినట్లు (Indian Railway General Ticket Rules) తెలుస్తోంది. ప్రస్తుతం రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్కార్, స్లీపర్ వంటి కోచ్లు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు జనరల్ బోగీలు కూడా ఉంటాయి. ముందస్తు రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం వీటిని తీసుకొచ్చారు.
జనరల్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులు వారు వెళ్లాలని భావిస్తున్న రూట్లో ఏ రైలులో అయిన ప్రయాణించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ టికెట్లతో అన్ని రైళ్లలో ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం జనరల్ టికెట్లపై రైల్వే స్టేషన్ల పేర్లు మాత్రమే ఉంటాయి. ఈ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మూడు గంటలే :
భారతీయ రైల్వే కొత్త నిర్ణయం ఆధారంగా జనరల్ టికెట్లపై రైలు పేరు కూడా ఉండనుంది. అందువల్ల అదే రైలులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు జనరల్ టికెట్ గడువు కూడా మూడు గంటలకు పరిమితం చేశారు. ఆ సమయం అనంతరం ఆ టికెట్లు చెల్లుబాటు కావని తెలుస్తోంది. త్వరలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పటి వరకు రైల్వే నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇటీవల మహా కుంభమేళాకు వెళ్లేందుకు వీలుగా న్యూడిల్లీ రైల్వే స్టేషన్కు వందలాది మంది ప్రయాణికులు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగి అనేక మంది ప్రయాణికులు మరణించారు. దీంతో ప్రస్తుతం ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేయాలని రైల్వే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనరల్ టికెట్లపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీంతోపాటు రైళ్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జనరల్ టికెట్లను రైల్వే స్టేషన్ కౌంటర్లలో మరియు UTS (అన్రిజర్వడ్ టికెట్ సిస్టమ్) యాప్ నుంచి బుకింగ్ చేసుకొనేందుకు అనుమతి ఉంది. ప్రస్తుతం రైల్వే జోన్ల ఆధారంగా జనరల్ టికెట్లపై మూడు నుంచి 24 గంటల వరకు ప్రయాణికులను అనుమతిస్తున్నారు.
ఈ కొత్త నిర్ణయం ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందో రైల్వే వెల్లడించలేదు. అయితే ఈ నిర్ణయం రైల్వే ప్రయాణికులకు ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. సీట్ల లభ్యత, సమయం, రద్దీ సహా ఇతర అంశాల ఆధారంగా జనరల్ టికెట్ల ప్రయాణికులు అదే రూట్లో వెళ్లే ట్రైయిన్ను ఎంచుకుంటున్నారు. ఈ కొత్త నిర్ణయంతో టికెట్లో ఉన్న రైలులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








