యాప్, వెబ్సైట్ ద్వారా రైల్వే టికెట్లను బుకింగ్ చేస్తున్నారా.. ఈ నిర్ణయం మీకు ఉపయోగపడుతుంది..!
రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియ గతం కంటే ఎంతో మెరుగైంది. గత కొన్ని సంవత్సరాల నుంచి IRCTC వెబ్సైట్, యాప్ నుంచే కాకుండా ఇతర డిజిటల్ పేమెంట్ యాప్ల నుంచి కూడా బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం కలిగి ఉంది. దీంతో రైల్వే స్టేషన్లోని కౌంటర్లో (Railway Refund process) గంటల తరబడి క్యూలో నిల్చోనే శ్రమ తప్పింది.
ఎక్కువ రద్దీ కారణంగా రైలు టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయినా లేదా రైలు టికెట్ను రద్దు చేసినా ఆ నగదు కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉంది. రైల్వే స్టేషన్ కౌంటర్లో తీసుకున్న టికెట్ అయితే అక్కడే రద్దుచేసుకొని నగదును వెనక్కి తీసుకొవచ్చు. అదే ఇ- టికెట్ అయితే మూడు నుంచి నాలుగు రోజులపాటు ఎదురుచూడాల్సి ఉంది.

అయితే ఈ రిఫండ్లను వేగంగా సెటిల్మెంట్ చేసేందుకు కొంత కాలం ముందే భారతీయ రైల్వే సిద్ధం అయింది. ఇందులో భాగంగా రిఫ్లండ్లను వేగవంతం చేయడంలో రైల్వే విజయవంతం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు రద్దుచేసుకున్న ఇ- టికెట్లలో సుమారు 50 శాతం వరకు ఆరు గంటల్లోనే నగదును వెనక్కి ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వే ఎటువంటి ప్రకటన చేయలేదు.
గతంలో ఈ రిఫండ్ సమయం 3 - 4 రోజులపాటు (Railway Refund process Timeline) ఉండేది. ప్రస్తుతం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రైల్వే చేసి ప్రయత్నం ఫలించింది. కాగా ఈ రిఫండ్ల ప్రక్రియ అంతా ఆటోమేటిక్గానే జరుగుతుంది. దీంతో దీనిపై దృష్టిసారించిన రైల్వే శాఖ.. వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం లక్షల మంది ప్రయాణికులకు మేలు చేస్తుంది.

**దీంతోపాటు రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడేలా.. భారతీయ రైల్వే మరో నిర్ణయం తీసుకుంది. UTS (అన్ రిజర్వడ్ టికెటింగ్ సిస్టమ్) లో కీలక మార్పులు చేసింది. ఈ యాప్ను 2018 లో రైల్వే ప్రవేశపెట్టింది. జనరల్ టికెట్ల కోసం రైల్వేస్టేషన్ క్యూలో గంటల తరబడి ఎదురుచూడకుండా నేరుగా ఈ యాప్ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు.
అయితే ఈ యాప్నకు గతంలో కొన్ని పరిమితులు ఉండేవి. వీటిని తొలగిస్తూ కొద్ది రోజుల క్రితం రైల్వే కొత్త అప్డేట్ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా టికెట్ను బుకింగ్ చేసుకొనేందుకు స్మార్ట్ఫోన్ లోకేషన్ ఆన్లోనే ఉండాలి. దీంతోపాటు స్టేషన్కు 50 కిలోమీటర్లు లోపల ఉండాలి. మరియు స్టేషన్కు కనీసం 15 కిలోమీటర్ల దూరం ఉండాలి.
అయితే ఈ దూరం పరిమితుల్లో తాజాగా మార్పులు చేసింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రైల్వే నిర్ణయం తీసుకుంది. తాజా అప్డేట్ ద్వారా స్టేషన్కు ఎంత దూరంలో ఉన్నా కూడా టికెట్ను బుకింగ్ చేసుకోవచ్చు. అయితే స్టేషన్లో నుంచి ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేయడం వీలుపడదు. కనీసం 5 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ UTS యాప్ ద్వారా 25 శాతం మంది ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారని రైల్వే తెలిపింది. 2022 లోనూ కొన్ని మార్పులు చేయగా.. తాజాగా మరింత సౌకర్యంగా టికెట్లను బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తే గంటల తరబడి బుకింగ్ కౌంటర్ల వద్ద ఎదురుచూడకుండా ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్లను బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








