ఉచిత వై-ఫైను కదులుతున్న రైళ్లలో ప్రవేశపెట్టనున్న రైల్వే శాఖ
అబివృద్ది చెందుతున్న దేశాలలో ఇండియా మొదటి వరుసలో ఉంటుంది. మరి ముఖ్యంగా స్మార్ట్ రంగంలో వేగంగా అబివృద్ది చెందుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొదటిలో రైల్వే స్టేషన్లలో వై-ఫైను ఉచితంగా అందిస్తోంది. ఇప్పటికే దేశం మొత్తం మీద సుమారు 5150 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సర్వీస్ ను ప్రారంభించింది.

స్మార్ట్ విభాగంలో ఇండియా ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నది అనడానికి ఉదాహరణగా దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగం. దేశ జనాభాలో 60% మందికి పైగా స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో 98% మంది డేటాను ఎక్కువగా వాడుతున్నారు. ఇంకా ఎక్కువ మంది మొబైల్ డేటాతో పాటు Wi-fi ల ద్వారా ఇంకా ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నారు.

ప్రయాణ మార్గాల విషయానికి వస్తే ఇండియాలో ఎక్కువ మంది రైళ్ల ప్రయాణాలను ఉపయోగిస్తున్నారు. దూర ప్రయాణాలకు ఎక్కువ మంది రైల్వే సర్వీసులను ఉపయోగిస్తున్నారు. దేశం అంతటా అన్ని ప్రాంతాలను కలుపుతూ ఉన్న రైళ్ల ప్రయాణంలో ప్రయాణికులకు అందిస్తున్న అన్ని వసతులతో పాటు ఇప్పుడు అదనంగా ట్రైన్ లోపల Wi-fi సర్వీసును అందించాలని కేంద్ర రైల్వే శాఖ ఆలోచిస్తోంది. వచ్చే ఏడాదికి దేశం మొత్తం మీద ఉచిత Wi-fi ను అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్యను కూడా 5150 నుండి 6,500 కు పెంచాలని చూస్తున్నది.

రైళ్ల లోపల Wi-fi సర్వీసును అందించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఇది మరింత క్లిష్టమైన టెక్నాలజీతో కూడుకున్న విషయం. నడుస్తున్న రైళ్లలో Wi-fiను సమర్ధవంతంగా అందివ్వడానికి పెట్టుబడి అధికంగా అవసరం అవుతుంది. దేశం మొత్తం కలుపుతున్న రైలు మార్గాలలో అన్ని చోట్ల అధికంగా టవర్లు మరియు Wi-fi పరికరాలను పెట్టవలసి ఉంటుంది. దీని కోసం కొత్త రకం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

రైళ్ల లోపల Wi-fi సర్వీసును అందించగలిగితే ఈ టెక్నాలజీ భద్రత విషయంలో కూడా చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ప్రతి రైలు కంపార్ట్మెంట్లో సిసికెమెరాలు ఉంటాయి. వీటికి వై-ఫై అందడం వలన పోలీసులు నేరుగా తమ పోలీస్ స్టేషన్లలో కూర్చొని మోనిటర్ చేస్తున్నారు. అలాగే వై-ఫై సౌకర్యం రైలు లోపల కూడా అందడంతో రైలు యొక్క గమనం మరియు లోపల జరుగు కార్యకలాపాలు అన్ని మోనిటర్ చేయవచ్చు. వచ్చే నాలుగు లేదా ఐదు సంవత్సరాలలో ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ రానున్న నాలుగు సంవత్సరాలలో తాము అభివృద్ధి చేయనున్న వాటిని తెలిపారు. ఇందులో భాగంగా వై-ఫై సౌకర్యం అందించడంతో పాటు దేశంలోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లను కొత్త రకమైన పద్దతులలో ఆధునీకరించనున్నారు. ఆధునికరణలో భాగంగా స్టేషన్లలో ఒకేసారి హౌసింగ్, కమర్షియల్ యాక్టివిటీ, షాపింగ్ మాల్స్ కోసం క్రాస్ సబ్సిడీ మోడల్లో కాంప్లెక్స్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం కొన్ని ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం చేసుకోనున్నారు.


Click it and Unblock the Notifications








