భారత్ లో ఒక్కొక్కరు నెలకి 27.5GB డేటా వాడేస్తున్నారా..? ఈ భారీ పెరుగుదలకు కారణాలు ఏంటంటే?
Mobile Data Usage India: ఒకప్పుడు ఇండియాలో నెలకి ఒక జీబీ ఇంటర్నెట్ డేటా వినియోగించడమే గగనం అయిపోయేది కానీ ఇటీవల కాలంలో భారతదేశంలో మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగిపోతోంది. ప్రతి నెలా ఒక్కో యూజర్ సగటున ఏకంగా 27.5GB డేటా వాడుతున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు, 5G సేవలు శరవేగంగా విస్తరించడమే ఈ భారీ పెరుగుదలకి కారణం.
ప్రముఖ టెలికాం సంస్థ నోకియా విడుదల చేసిన మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ (MBiT) రిపోర్ట్ ప్రకారం, గత ఐదేళ్లలో డేటా వినియోగం ఏకంగా 19.5% వృద్ధి రేటుతో పెరిగింది. 5G నెట్వర్క్ విస్తరణ ఇలాగే కొనసాగితే, 2030 నాటికి నెలవారీ డేటా వాడకం 50GB దాటే అవకాశం ఉందని అంచనా.

* 5Gతో డేటా వినియోగం పెరిగింది
5G టెక్నాలజీ రాకతో భారతదేశం డిజిటల్ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికింది. 2024లోనే 5G డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, నగరాల్లో (B, C కేటగిరీలు) 5G వినియోగం పెరిగింది. ఈ ప్రాంతాల్లో డేటా వాడకం వరుసగా 3.4 రెట్లు, 3.2 రెట్లు పెరగడం విశేషం.
మెట్రో నగరాల్లో మొత్తం మొబైల్ బ్రాడ్బ్యాండ్ వాడకంలో 5G వాటా ఇప్పుడు 43 శాతానికి చేరింది. గతేడాది (2023) ఇది కేవలం 20% మాత్రమే. దీన్ని బట్టి చూస్తే, యూజర్లు 4G నెట్వర్క్లను వదిలి, వేగవంతమైన 5G వైపు పరుగులు పెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
* 5G స్మార్ట్ఫోన్లు, ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్
5G నెట్వర్క్ విస్తరిస్తున్న కొద్దీ, 5G ఫోన్లకు డిమాండ్ కూడా ఆకాశాన్ని తాకుతోంది. 2024లో ఇండియాలో యాక్టివ్గా ఉన్న 5G డివైజ్ల సంఖ్య రెట్టింపు అయి, 27.1 కోట్లకు చేరింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే, 2025లో అమ్మే స్మార్ట్ఫోన్లలో దాదాపు 90% 5G ఫోన్లే ఉంటాయని అంచనా.
ఇంకా చెప్పాలంటే, ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) డేటా వినియోగాన్ని విపరీతంగా పెంచుతోంది. FWA అంటే.. వైర్ లేకుండా మొబైల్ నెట్వర్క్ ద్వారానే హై-స్పీడ్ ఇంటర్నెట్ పొందడం. సాధారణ మొబైల్ యూజర్లతో పోలిస్తే, FWA యూజర్లు ఏకంగా 12 రెట్లు ఎక్కువ డేటా వాడుతున్నారు. దీంతో డేటా వినియోగం అమాంతం పెరిగిపోతోంది.
* 5G ఫ్యూచర్.. 6Gకి బాటలు..
2026 ప్రారంభం నాటికి 5G డేటా ట్రాఫిక్, 4Gని కూడా దాటేసి, ఇండియాలో నంబర్ వన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీగా నిలుస్తుందని నివేదిక అంచనా వేస్తోంది. ప్రతి సంవత్సరం దాదాపు 12 కోట్ల మంది కొత్త 5G యూజర్లు వస్తారని అంచనా. దీంతో 2028 నాటికి మొత్తం 5G యూజర్ల సంఖ్య 77 కోట్లకు చేరుకుంటుంది.
ఇంకా ముందు ముందు 5G అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాబోతోంది. ఇది నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. మెరుగైన సర్వీస్ క్వాలిటీ, కొత్త ఆదాయ మార్గాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ ద్వారా మరింత స్మార్ట్ ఆపరేషన్స్కు ఇది దారి తీస్తుంది.
ఇవన్నీ భవిష్యత్తులో 6G టెక్నాలజీకి కూడా పునాది వేస్తాయి. అప్పుడు కనెక్టివిటీ మరింత అధునాతనంగా ఉంటుంది, సరికొత్త అప్లికేషన్లు అందుబాటులోకి వస్తాయి.


Click it and Unblock the Notifications








