రైలు ఆలస్యంగా వస్తే డబ్బులు వెనక్కి,పట్టాలెక్కనున్న ప్రైవేటు రైలు
రైల్వేస్ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని IRCTC నిర్ణయించింది. ఈ మేరకు 2 తేజస్ రైళ్లను త్వరలో నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా అక్టోబర్ నుంచి ఈ 'ప్రైవేటు’ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్ నడవనుంది. మొదట ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్ప్రెస్ నడిపిస్తారు. ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్ప్రెస్ని అందుబాటులోకి తీసుకొస్తారు.

రైలులో పలు ప్రత్యేకతలు
ఈ ప్రైవేట్ రైలులో పలు ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభించబోతున్నాయి. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం సమయంలో కొన్ని స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. రైలు బోగీల్లో పాంట్రీ కార్లు ఏర్పాటు చేయనున్నారు.రెండుసార్లు భోజనం, ఉచితంగా టీ, కాఫీల కోసం వెండింగ్ మిషన్ ఏర్పాటుతో పాటు సీనియర్ సిటిజెన్ల టికెట్పై 40% డిస్కౌంట్ ఇవ్వనుందట. మరోవైపు తేజస్ ప్రైవేటు టికెట్ కొనేవారికి రూ. 50లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా వర్తిస్తుందని సమాచారం. రైల్లో ఉన్న సమయంలో వారింట్లో దొంగలు పడితే ఆ నష్టపరిహారం కూడా వస్తుందట. అటు రైలు గంట ఆలస్యమైతే అందుకు తగ్గ పరిహారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల ఇ-వ్యాలెట్లో కొంతడబ్బు జమ చేయాలని లేదా భవిష్యత్తులో బుక్ చేసే టికెట్లపై తగ్గింపు ఆఫర్ చేయాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది.

ఎయిర్లైన్స్ తరహాలో
ఎయిర్లైన్స్ తరహాలో తేజస్ ఎక్స్ప్రెస్లో టాయిలెట్లను తీర్చిదిద్దబోతోంది. ప్రతీ కోచ్లో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టాయిలెట్స్ ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కే నాటికి సౌకర్యాలు, సదుపాయాల గురించి స్పష్టత రానుంది. అక్టోబర్ నుంచి ఈ 'ప్రైవేటు’ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.


Click it and Unblock the Notifications








