chandrayaan-3 ల్యాండింగ్కు మరో తేదీ ప్రకటించిన ఇస్రో.. ఎందుకంటే..!!
యావత్ భారతం రేపటి రోజు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అంతరిక్షంలో ఇస్రో విజయయాత్రను కళ్లారా చూసేందుకు వేచిచూస్తోంది. చంద్రయాన్2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఆగస్టు 23 సాయంత్రం 06:04 నిమిషాలకు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.
అయితే ఇంతలో ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 23న చంద్రయాన్3 ల్యాండింగ్కు 2 గంటల ముందు ల్యాండర్ మాడ్యూల్, చంద్రుడిపై పరిస్థితుల ఆధారంగా ల్యాండింగ్ చేయాలో వద్దో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఒకవేళ పరిస్థితి అనుకూలంగా లేకుంటే మాత్రం ల్యాండింగ్ను వాయిదా వేసి, ఆగస్టు 27న సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ వెల్లడించారు.

ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 23 సాయంత్రం 05:27 నుంచి ఇస్రో వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, డీడీ నేషనల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటికే ప్రతి విషయాన్ని సోషల్మీడియా ద్వారా ఇస్రో వెల్లడిస్తోంది.
చంద్రయాన్ 2 మిషన్లోని ల్యాండర్లో సాంకేతిక కారణాల వల్ల చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. అయితే ఇందులోని ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది. ఈ ఆర్బిటర్, చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్కు మధ్య కమ్యూనికేషన్ను విజయవంతంగా ఏర్పాటుచేసింది. విక్రమ్ ల్యాండర్ ప్రతి సమాచారాన్ని ఆర్బిటర్కు పంపనుంది. అక్కడ నుంచి ఇస్రో కేంద్రానికి సమాచారం రానుంది.
ఆగస్టు 20న విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చివరి డీ బూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ల్యాండర్ 25*134 కి.మీ కక్ష్యలో తిరుగుతోంది. ల్యాండర్ మాడ్యూల్లో అంతర్గత తనిఖీలు జరుగుతున్నాయని.. చంద్రుని ఉపరితలంపై తాము ఎంచుకున్న ప్రాంతంలో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నామని ఇప్పటికే ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3 ప్రయోగం నుంచి ఇప్పటి వరకు అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇప్పటి వరకు చంద్రునిపై అమెరికా, చైనా, రష్యా దేశాలు సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. భారత్ కూడా వాటి సరసన చేరనుంది. అయితే చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలిదేశంగా భారత్ ఖ్యాతి గడించనుంది.
చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత.. ల్యాండర్ లోపల ఉన్న ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితరంపై తిరుగుతూ 14 రోజుల పాటు వివిధ రకాల పరిశోధనలు చేస్తుంది. అయితే ప్రొపల్షన్ మాడ్యూల్ మాత్రం చంద్రుని కక్ష్యలోనే తిరుగుతూ భూవాతావరణాన్ని అధ్యయనం చేయనుంది.
2008 నుంచి చంద్రునిపై భారత అంతరిక్ష సంస్థ - ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిపై నీటి ఉనికిని తొలిసారిగా కనుగొంది. అనంతరం 2019 జులై 22న ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగించింది.
ఇందులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన. అయితే చివరి వరకు అంతా సవ్యంగా జరిగినా.. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలానికి కేవలం 2 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ల్యాండర్లో సమస్య తలెత్తింది. దీంతో ల్యాండంగ్ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది.
అయితే చంద్రయాన్-2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. జూలై 14న చంద్రయాన్-3ను ప్రయోగించింది. గతంలోని పొరపాట్లు జరగకుండా కీలక చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని చోట సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, కీలక పరిశోధనలు చేయాలని భావిస్తోంది. విశ్వం పుట్టుగ సహా భవిష్యత్లో చంద్రుడిపై నివాసాలు ఏర్పాటుపై ప్రయోగాలు చేయనుంది.


Click it and Unblock the Notifications








