15 ఏళ్లుగా సిక్ లీవ్.. 55 లక్షల జీతం.. అయినా వేతనం పెంచడం లేదని సంస్థపై కేసు..!
అత్యధిక వేతనం పొందుతున్న వారిలో ఐటీ ఉద్యోగులు అగ్రస్థానంలో ఉంటారు. భారీ వేతనాలతో సహా అనేక సౌకర్యాలను వీరు సంస్థల నుంచి పొందుతారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఉద్యోగికి ఏం జరిగినా కొన్ని సంస్థలు భారీగా ప్రయోజనం కలిగిస్తాయి. అయితే తన సంస్థ వేతనం పెంచడం లేదంటూ కోర్టుకెళ్లిన ఓ ఉద్యోగి కేసులో ఓ ఆశ్యర్యకరమైన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.
అనారోగ్యం కారణంగా సుమారు 15 సంవత్సరాలుగా సెలవులో ఉన్న ఓ ఐటీ ఉద్యోగి.. ఏకంగా సంస్థపైనే కేసుపెట్టాడు. IBM సంస్థ తన వేతనం పెంచకుండా వివక్ష చూపుతోందని ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్లో కేసుపెట్టాడు. ద్రవ్యోల్బణం కారణంగా తన వేతనం 54,028 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు 55 లక్షలు) తగ్గిపోతోందని ఆరోపించాడు. దీనిపై వాదనలు విన్న ట్రైబ్యునల్ న్యాయమూర్తి కేసును డిస్మిస్ చేశారు. ఇప్పటికే సదరు ఉద్యోగి గణనీయమైన ప్రయోజనాలు పొందుతున్నారని వెల్లడించారు.

క్లిఫోర్డ్ 2000 సంవత్సరంలో లోటస్ డెవలప్మెంట్ సంస్థలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. అనంతరం ఆ సంస్థను IBM కొనుగోలు చేసింది. 2008 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా సెలవు పెట్టారు. తనకు గత ఐదేళ్లలో వేతనంలో పెరుగుదల లేదని. సెలవు వేతం కూడా రావడం లేదని 2013లో ఫిర్యాదు చేశాడు.
ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఐబీఎం ప్రయత్నం చేసింది. సదరు ఉద్యోగిని వికలాంగుల పథకంలో చేర్చింది. దీని ప్రకారం సంస్థ ఆమోదించిన పథకంలో నమోదైన ఉద్యోగులు.. దీర్ఘకాలిక అనారోగ్యం, పదవీ విరమణ లేదా మరణం. ఏది ముందుగా సంభవించినా.. ఉద్యోగి అప్పటికి వస్తున్న వేతంలో 75 శాతం పొందేందుకు అర్హులు. ఫలితంగా ప్రస్తుతం ఉద్యోగి పొందుతున్న వేతనంలో 75 శాతం ప్రతి సంవత్సరం వచ్చేలా ఏర్పాటుచేస్తుంది.
క్లిఫోర్డ్ విషయంలోనూ సంస్థ ఇలానే వ్యవహరించింది. అతడి వేతనం 72,037 పౌండ్లు.. అందులో 75 శాతం అంటే 54,028 పౌండ్లను ( భారత కరెన్సీలో సుమారు 55.34 లక్షలు రూపాయలు).. అతనికి 65 ఏళ్లు వచ్చే వరకు చెల్లించనుంది.
దీనిపై ఉద్యోగి క్లిఫోర్డ్ భిన్నంగా స్పందించాడు. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా వేతన పెరుగుదల పొందిన వికలాంగులు కానీ ఉద్యోగులతో పోల్చితే తనపై వివక్ష చూపారని తెలిపాడు. ద్రవ్యోల్బణ రేటుకు అనుగుణంగా తన వేతన సవరణ జరగపోతే వేతనం తగ్గిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై 2022 సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్లో కేసు వేశాడు.
ఈ కేసులో విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ న్యాయమూర్తి తన తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించారు. వికలాంగుల పథకం ప్రకారం.. ఎవరైతే పనిచేయలేరో వారికి ఈ పథకం కింద జీవన భద్రత సదరు సంస్థ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగి విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించకపోవడం వివక్ష చూపడం కాదని తన తీర్పులో వెల్లడించారు. IBM సంస్థ ఎటువంటి వివక్ష చూపలేదని స్పష్టం చేశారు.
సదరు ఉద్యోగి సంవత్సరానికి 50,000 పౌండ్లకు పైగా ప్రయోజనం పొందుతున్నారని తీర్పులో న్యాయమూర్తి ప్రస్తావించారు. ప్రస్తుతం వస్తున్న వేతనం రానున్న 30 ఏళ్లలో సగానికి తగ్గినా.. గణనీయమైన ప్రయోజనంగా మిగిలిపోతుందని ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ న్యాయమూర్తి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








