జియో నుంచి కీలక ప్రకటన.. వినాయక చవితి రోజున జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం
దేశంలో జియో ప్రారంభం ఒక సంచలం సృష్టించింది. డేటా వినియోగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా అధిక వేగంతో కూడిన డేటా అందుబాటులోకి వచ్చింది. డేటా రేట్లు భారీగా దిగివచ్చాయి. అన్లిమిటెడ్ కాలింగ్ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా స్మార్ట్ఫోన్ల వినియోగం కూడా భారీగా పెరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ జియో ఎయిర్ఫైబర్ను వినాయక చవితి రోజైన సెప్టెంబర్ 19న లాంచ్ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతాలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని గురించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

గత సంవత్సరం రిలయన్స్ నిర్వహించిన సాధారణ సమావేశంలో జియో ఎయిర్ఫైబర్ను ప్రకటించారు. ఇది రిలయన్స్ జియో నుంచి ప్లగ్ అండ్ ప్లే 5G బ్రాడ్బ్యాండ్ రూటర్. జియో ఎయిర్ఫైబర్ను ఇన్స్టాల్ చేసేందుకు కస్టమర్లు ఎలాంటి వైరింగ్, కేబుల్ అవసరం ఉండదు. జియో ఫైబర్ పరికరం సరిపోతుంది. దీంతో వినియోగదారులు తమ సొంత Wi-Fi హాట్స్పాట్ను ఇంట్లోనే కలిగి ఉంటారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో 5G విస్తరణ జరుగుతోందని ముఖేష్ అంబానీ చెప్పారు. ప్రస్తుతం జియో నెట్వర్క్లో 450 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 96 శాతం పట్టణాల్లో జియో 5G విస్తరణ పూర్తయిందని, డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు. జియో నెట్వర్క్లో ప్రస్తుతం ప్రతి ఒక్కరి వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం సగటున ప్రతి నెలా 25 GB డేటాను వినియోగిస్తున్నట్లు చెప్పారు.

దేశాన్ని డిజిటల్ సొసైటీగా మార్చాలనే లక్ష్యంతో 7 సంవత్సరాల క్రితం జియో నెట్వర్క్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకోసం తమ హృదయాన్ని, ఆత్మను పెట్టుబడి పెట్టామని ముఖేష్ అంబానీ వివరించారు. న్యూ ఇండియా అద్భుతమైన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు జియో ప్రధాన ఉత్పేరకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గత 10 సంవత్సరాల్లో $150 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టిబడి పెట్టినట్లు తెలిపారు. 2047 నాటికి పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నవ భారతంలో రిలయన్స్ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకొని.. సుసాధ్యం చేశామంటూ సంతోషం వ్యక్తం చేశారు.
అయితే ఎయిర్టెల్ ఇప్పటికే ఎక్స్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ను రూ.799 ప్రారంభ ధరతో ప్రారంభించింది. అయితే జియో ధర కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జియో ఎయిర్ ఫైబర్ను స్మార్ట్ టీవీ, ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలకు సులభంగా కనెక్ట్ చేయవచ్చునని తెలుస్తోంది. అయితే ఈ జియో ఎయిర్ఫైబర్ ప్రారంభ ధర, ప్లాన్లు, ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
గిజ్బాట్ తెలుగు వెబ్సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








