జియో సంచలన నిర్ణయం,వచ్చే ఏడాది IPO ప్రకటన!
టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుందని వార్తలు వస్తున్నాయి. 2020 ఏడాది రెండో అర్ధభాగంలో ఐపీవోకు రానుందని తెలుస్తోంది. ఈ మేరకు పలుమార్లు వివిధ వర్గాలతో చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది.

కాగా ఇది వరకే ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.వాటిని జియో సైతం ఖండించింది.ఇప్పుడు మళ్లీ జియో IPOకు వెళుతుందనే వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. 2017లోనే జియో ఐపీఓలోకి వెళ్లేందుకు సెబీ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఇప్పుడు అలాంటి అవసరం లేదని తెలుస్తోంది.

జోరందుకున్న ఐపీఓ యత్నాలు
వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో జియోను పబ్లిక్ ఆఫర్కు తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అయితే అంతకన్నా ముందు తమ టవర్లు, ఫైబర్ అసెట్ల నిర్వహణ చూస్తే ఇన్విట్స్కు ఇన్వెస్టర్లను తీసుకురావాలని ఆర్ఐఎల్ భావిస్తోంది. గతవారం జియో ఐపీఓ యత్నాలు జోరందుకున్నాయని సంకేతమిచ్చే పలు సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది.

బ్యాంకర్ల ఆందోళన
త్వరలో టెలికం వినియోగదారుల పరంగా టాప్లోకి వస్తామని జియో వివిధ బ్యాంకర్లకు తెలియజేసింది. ఇదే జరిగితే కంపెనీ రెవెన్యూ పెరగడంతో పాటు ఐపీఓ విజయవంతంగా సబ్స్క్రైబ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బ్యాంకర్లు మాత్రం కంపెనీ ఏఆర్పీయూ పడిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేశాయని తెలిసింది. జియో ఏఆర్పీయూ వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా క్షీణత నమోదు చేసింది. మరోవైపు పోటీ కంపెనీలైన ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియాల ఏఆర్పీయూ జియో కన్నా తక్కువగా ఉన్నా, క్రమానుగతంగా మెరుగుపడుతోంది.

2020 మార్చి తర్వాతే..
మరోవైపు ఇటీవలే వేరు చేసిన జియో డిజిటల్ ఫైబర్, జియో ఇన్ఫ్రాటెల్ కంపెనీలకు తగిన పెట్టుబడులు వచ్చాకే జియో ఐపీఓ తీసుకువస్తామని ఆర్ఐఎల్ చెబుతోంది. నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ ఫలితాల ప్రకటన ఆరంభించిన మూడేళ్ల తర్వాత కానీ ఏ కంపెనీ ఐనా ఐపీఓకి వచ్చేందుకు వీల్లేదు. ఈ ప్రకారం జియో ఐపీఓ 2020 మార్చి తర్వాతే సాధ్యమవుతుంది.

మేనేజర్లు వీరే
మోయిలిస్, ఐసీఐసీఐ, సిటి సంస్థలు జియో ఇన్విట్స్కు పెట్టుబడిదారులను సమకూర్చే మేనేజర్లుగా నియమితమయ్యాయి. ఇవే సంస్థలు జియో ఐపీఓకి మేనేజర్లుగా వ్యవహరించే అవకాశాలున్నాయి.

2017లోనే జియో IPOకు
ఇదిలా ఉంటే 2017లోనే జియో IPOకు వెళుతుందనే వార్తలు వచ్చాయి. 2018 చివర్లో గాని 2019 ప్రారంభంలొ గాని ఐపీఓకు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిని జియో ప్రతినిధులు ఖండించారు. దీనికి ప్రధాన కారణం సెబీ నిబంధనలేనని తెలుస్తోంది.

సెబి నిబంధనలేంటి?
సెబీ నిబంధనల ప్రకారం ఒక కంపెనీ ఐపీఓ ప్రకటించాలంటే మూడేళ్లలో రూ. 15 కోట్ల లాభాలను ఆర్జించి ఉండాలి. అయితే 2017 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి రిలయన్స్ జియో రూ. 270. 59 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. సెబీ నిబంధనలకు ఇది విరుద్ధంగా ఉండటంతో ఐపీఓకు వెళ్లే ఆలోచనను కంపెనీ విరమించుకుంది. అప్పుడు మార్కెట్ ని మరింతగా విస్తరించి సంస్థ ఆదాయాన్ని మెరుగుపర్చుకుని ఐపీఓకు వెళతామని జియో ప్రతినిధులు చెప్పారు.


Click it and Unblock the Notifications








