దేశమంతటా ఫ్రీ రోమింగ్..2013 నుంచి అమలు?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ అదేవిధంగా టెలిఫోన్ యూజర్లకు శుభవార్త. మీరు వచ్చే ఏడాది నుంచి రోమింగ్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దేశంలోని ఏ ప్రాంతానికైనా మీ సొంత నెంబర్తో.. ఏ విధమైన అదనపు చార్జీలు చెల్లించుకుండా నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. ఈ విషయాన్ని స్వయానా టెలికాం శాఖా మంత్రి కపిల్ సిబల్ సోమవారం వెల్లడించారు. 2012 టెలికాం జాతీయ విధానంలో ప్రభుత్వం రోమింగ్ చార్జీల ఎత్తివేతను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోమింగ్ చార్జీలు ఎత్తివేత వల్ల కాల్ చార్జీలు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
మరో వైపు టెలికాం స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి వారం రోజుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు టెలికాం శాఖ కార్యదర్శ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ జారీ తర్వాత యూనిఫైడ్ లైసెన్స్కు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నట్టు ఆయన చెప్పారు. దాని తర్వాతే ఉచిత రోమింగ్ అమల్లోకి వస్తుందని అన్నారు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలని చెప్పారు. దేశమంతా ఫ్రీ రోమింగ్ ఉండాలనే ప్రతిపాదన మంచిదేనని అయితే దీనికి పరిశ్రమ కూడా సన్నద్ధం కావాల్సి ఉందని సెల్ఫోన్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యు చెప్పా రు. కన్సల్టేషన్ పేపర్ ద్వారా ట్రాయ్ పరిశ్రమతో సంప్రదించిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుందని మాథ్యు అన్నారు.


Click it and Unblock the Notifications