తగ్గనున్న ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు
ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు త్వరలోనే తగ్గనున్నాయి. దేశీయంగా ల్యాండ్ఫోన్ కనెక్షన్ల వాడకాన్ని మరింత పెంచే ఉద్దేశ్యంతో టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ కాల్ కనెక్టింగ్ చార్జీలను ఎత్తివేసింది.

దీంతో రానున్న రోజుల్లో ల్యాండ్ లైన్ కాలింగ్ చార్జీలు మరింత తగ్గుముఖం పట్టునున్నాయి. ప్రస్తుతం ల్యాండ్లైన్ సేవలందిస్తోన్న టెలికాం సంస్థలు తమ వినియోగదారుడు ఇతర నెట్వర్క్కు చెందిన వినియోగదారుడికి కాల్ చేసినపుడు ఇంటర్కనెక్షన్ చార్జీల క్రింద 20 పైసలు చెల్లించాల్సి వచ్చేది.

తాజాగా ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. వేరువేరు మొబైల్ నెట్వర్క్ల మధ్య కూడా 20 పైసలుగా ఉండే ఇంటర్కనెక్షన్ చార్జీలను 14 పైసలకు తగ్గిస్తూ ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసకుంది. దేశీయంగా 2014 చివరినాటికి మొబైల్ చందదారుల సంఖ్య 94.39 కోట్లకు చేరుకోగా, ల్యాండ్లైన్ ఫోన్ల సంఖ్య మాత్రం 2.7 కోట్లు గానే ఉంది.

ఇంటర్కనెక్షన్ చార్జ్ అంటే ఏంటి..?
ఒక నెట్వర్క్ వినియోగదారుడు, మరో నెట్వర్క్ వినియోగదారుడికి కాల్ చేస్తే, అతని సర్వీస్ ప్రొవైడర్ కాల్ వెళ్లిన సర్వీస్ ప్రొవైడర్కు చెల్లించేదే ఇంటర్కనెక్షన్ ఛార్జ్. వినియోగదారులు చెల్లించే కాల్ రుసుములో దీన్ని వసూలు చేస్తారు. ల్యాండ్లైన్ ఫోన్లకు ఇది పూర్తిగా రద్దు కాగా, మొబైల్ సంస్థల మధ్య 14 పైసలకు తగ్గించటం జరిగింది.


Click it and Unblock the Notifications








