RBI దెబ్బకు తలవంచిన వాట్సప్,భారత్లోనే డేటా స్టోరేజ్
నరేంద్రమోడీ ప్రధాని మంత్రి అయిన తరువాత తీసుకున్న నగదు బదిలీ, 'నోట్ల రద్దు’ వంటి నిర్ణయాల పుణ్యమాని దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఆ పరిణామాన్ని అందిపుచ్చుకొని పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేలాంటి సంస్థలు భారీగా లాభపడ్డాయి. కోట్లకు పడగలెత్తాయి. దేశంలో మోడీ వచ్చాక బ్యాంకు లావాదేవీలు తగ్గి ఆన్ లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఇప్పటికే దేశంలో గూగుల్ పే ఫోన్ పే సహా అన్ని బ్యాంకులు తమ యాప్ ల ద్వారా యూపీఐ భీమ్ పేమెంట్స్ పేరిట ఆన్ లైన్ చెల్లింపులకు అవకాశం కల్పించాయి. అయితే ఆర్బీఐ కఠిన నిబంధనల నేపథ్యంలో వాట్సప్ మాత్రం ఆన్ లైన్ లావాదేవీల వ్యవహారాలను ఇంతరవకు చేపట్టలేదు.ఈ నేపథ్యంలో వాట్సప్ పేమెంట్స్కు లైన్ క్లియర్ అయింది. ఇండియాలో వాట్సప్ పేమెంట్స్ సేవల త్వరలో ప్రారంభం కానున్నాయి.

భారత్లోనే డేటా స్టోరేజ్
ఆర్బీఐ సూచనలతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన పేమెంట్స్ బిజినెస్ కోసం భారత్లోనే డేటా స్టోరేజ్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. భారత యూజర్ల లావాదేవీల డేటాను స్ధానికంగానే గ్లోబల్ పేమెంట్స్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నొక్కిచెబుతున్న విషయం తెలిసిందే. వాట్సప్ నిర్ణయంతో తన డిజిటల్ చెల్లింపుల సేవలను పూర్తిస్ధాయిలో ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

దేశంలో డేటా సెంటర్ ఓపెన్
ఇప్పటికే డేటా దుర్వినియోగం అయ్యి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు భద్రతకు ముప్పుకలుగుతున్న దృష్ట్యా ఆర్బీఐ భారత దేశంలో డేటాను భద్రపరిచిన వారికే పేమెంట్స్ లావాదేవీలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే విదేశాల్లోనుంచి ఆపరేట్ అవుతున్న సదురు సంస్థలకు ఇది భారీ వ్యయ ప్రయాసల ప్రక్రియ కావడంతో వెనుకడుగు వేశారు. కొన్ని సంస్థలు గూగుల్- అమేజాన్ లు దేశంలో డేటా సెంటర్ ఓపెన్ చేసి తమ పేమెంట్స్ యాప్స్ సర్వీసులను కొనసాగిస్తున్నాయి.

నిబంధనలు పాటించి తీరాల్సిందే
ఇప్పటికే విదేశాల్లోని సర్వర్లలో డేటా నిల్వ, ప్రాసెస్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు..మళ్లీ భారత్లో కూడా ప్రత్యేకంగా డేటా స్టోరేజీ చేయాలంటే శ్రమ, వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని, తమకు మినహాయింపునివ్వాలని ఆర్బీఐని కోరాయి. కానీ భారత యూజర్ల డేటా భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించి తీరాల్సిందేనంటూ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కావాలంటే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేసుకోవచ్చని, అయితే ఆ తర్వాత 24 గంటల్లోగా భారత్లోని సిస్టమ్స్లోకి బదలాయించాల్సి ఉంటుందని పేర్కొంది.

యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ
వాట్సప్ యూపీఐ ఆధారిత సేవలను ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి అందిస్తుందని ఈ సేవలు యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ వంటి పలు బ్యాంకుల ద్వారా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. డేటా లోకలైజేషన్తో పాటు ఆడిట్ ప్రక్రియను వాట్సప్ పూర్తిచేస్తోందని, ఆడిటర్స్ తమ నివేదికను సంబంధిత రెగ్యులేటర్కు సమర్పించిన అనంతరం పేమెంట్స్ అప్లికేషన్స్ను వాట్సాప్ ప్రారంభిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో
కాగా ప్రస్తుతం పైలట్ మోడల్లో వాట్సప్ పేమెంట్స్ లావాదేవీలుగా సాగుతున్నాయి. వాట్సప్ పేమెంట్స్ను పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన లాంఛనాలను వేగంగా చేపడతున్నారు. అమెరికన్ సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్లో భాగమైన వాట్సప్ 2018లోనే ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో యూజర్లకు పేమెంట్ సేవలు అందించడం ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో తమ యాప్లో పేమెంట్స్ ఫీచర్ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.

పూర్తి స్థాయిలో సేవలు
అయితే, దీనిపై వివాదం రేగింది. నియంత్రణ సంస్థ ఆదేశాలకు విరుద్ధంగా డేటాను భారత్లో కాకుండా విదేశాల్లో భద్రపరుస్తుండటం, యూజర్ల డేటా భద్రతపై అనుమానాలు, వాట్సప్లో తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్గా మారుతుండటం తదితర అంశాలు ఈ ప్రాజెక్టుకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ప్రధానమైన డేటా లోకలైజేషన్ అంశంతో పాటు ఇతరత్రా సమస్యలన్నింటినీ వాట్సప్ పరిష్కరించుకోవడంతో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

39 థర్డ్ పార్టీ యాప్స్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజా గణాంకాల ప్రకారం దేశీయంగా మొత్తం 39 థర్డ్ పార్టీ యాప్స్.. పేమెంట్స్ సర్వీసులు అందిస్తున్నాయి. గూగుల్ పే, అమెజాన్, ఉబెర్, ఓలా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications