ఐటీ నిపుణులను ఆకట్టుకునేందుకు మహీంద్రా సత్యం తీవ్రంగా శ్రమిస్తోంది. వేగవంతమైన అభివృద్ధి ఉన్న భారత్తో పాటు ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాల్లో కూడా అధిక నైపుణ్యం గల వారిని తమ ఉద్యోగులుగా నియమించుకొనేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. మహిళా నిపుణులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వృత్తి జీవితానికి విరామం ప్రకటించిన మహిళా ఐటీ నిపుణులకు మరో అవకాశంకల్పించే విధానానికి (స్టార్టింగ్ ఓవర్) శ్రీకారం చుట్టింది. వారి గత అనుభవాన్నే పరిగణనలోకి తీసుకోక, సామర్థ్యానికి అనుగుణంగా బాధ్యతలు కేటాయిస్తారు. ఇంటర్న్షిప్, పార్ట్టైం, ఫుల్ టైం ఉద్యోగాల చాయిస్ ఉంటుందని, అందరికీ అవకాశాలు లభించేలా చూస్తామని మహీంద్రా సత్యం మానవ వనరుల విభాగం (ఆసియా పసిఫిక్) అధిపతి సురేశ్ సముద్రాల పేర్కొన్నారు.
ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెమినార్లు, వర్క్షాప్ల ద్వారా తమ ఆత్మస్త్థెర్యం ఇనుమడిస్తోందని స్టార్టింగ్ ఓవర్ విధానంలోనే నియమితురాలయిన లక్కరాజు మాధవి అనే నిపుణురాలు చెప్పారు. విదేశాల్లోని తమ కార్యాలయాల్లో 55 శాతం అవకాశాలను అక్కడి వారికే మహీంద్రా సత్యం కేటాయిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్లోని ఎన్యూఎస్, మరికొన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకొంది. ఇంజినీరింగ్ ఉత్తీర్ణులకు మహీంద్రా సత్యంకు చెందిన హైదరాబాద్, మలేసియాల్లోని కేంద్రాల్లో 3 నెలలు శిక్షణ ఇస్తారు.
మాస్టర్కార్డ్తో మహీంద్రా సత్యం ఒప్పందం: మాస్టర్ కార్డ్తో కుదుర్చుకొన్న ఒక ఒప్పందం మేరకు మలేషియాలోని కౌలాలంపూర్లో టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మహీంద్రా సత్యం ప్రకటించింది. ఒప్పందం విలువ ఎంతనేది మహీంద్రా సత్యం వెల్లడించలేదు.