OLXలో వెలుగు చూసిన మరో మోసం, తక్కువ ధరకే ఐఫోన్ అంటూ బురిడీ
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నా సరే చాలా మందికి ఐఫోన్లను వాడాలనే కోరుకుంటారు .
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నా సరే చాలా మందికి ఐఫోన్లను వాడాలనే కోరుకుంటారు . కానీ కొత్తగా ఐఫోన్లను కొని వాడాలంటే అది చాలా మందికి తమ తాహతుకు మించిన పనే అవుతుంది ఎందుకంటే అవి కాస్త ధర ఎక్కువ కాబట్టి. ఈ క్రమంలోనే చాలా మంది సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు . అందులో భాగంగానే ప్రస్తుతం ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే సైట్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. అయితే సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను కొనాలనే ఆసక్తి ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే సైట్లలో పలువురు కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. ఐఫోన్లను ఎలాగైనా వాడాల్సిందేనన్న కోరిక బలంగా ఉన్నవారు ఇలాంటి కేటుగాళ్ల బారిన పడి డబ్బులు నష్టపోతున్నారు.

ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో ఐఫోన్ 6 కేవలం రూ.12,500 కే....
ఓఎల్ఎక్స్ అనే క్లాసిఫైడ్ వెబ్సైట్లో ఐఫోన్ 6 కేవలం రూ.12,500 కే వస్తుందన్న ప్రకటన తెలుసుకున్న అమన్ అనే వ్యక్తి సదరు ప్రకటన ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి ఆ మొత్తాన్ని, మరో రూ.1550 కొరియర్ ఖర్చులను కలిపి మొత్తం సొమ్మును అవతలి వ్యక్తికి పేటీఎం చేశాడు.

ఫోన్ డెలివరీ కాలేదు...
కానీ చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు అమన్కు ఫోన్ డెలివరీ కాలేదు. అలాగే మరో ఘటనలో ఓ వ్యాపారవేత్త తన కుమారుడికి ఐఫోన్ 8 ప్లస్ కొనాలనే ఉద్దేశంతో అదే సైట్లో ప్రకటనలు చూశాడు. వాటిల్లో పాత ఐఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.16వేలకే కొత్త ఐఫోన్ 8 ప్లస్ ఇస్తామని ఓ వ్యక్తి ప్రకటన ఇవ్వడంతో ఆ వ్యాపారవేత్త ఫోన్ ఖరీదుతోపాటు మరో రూ.4వేలు అదనపు చార్జిలు కలిపి రూ.20వేలను అవతలి వ్యక్తికి చెల్లించాడు. కానీ నెలలు గడుస్తున్నా అతనికి ఐఫోన్ డెలివరీ కాలేదు.

ఆర్మీలో పనిచేస్తున్న సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు.....
అయితే ఈ రెండు ఘటనల్లోనూ ప్రకటనలు పెట్టిన ఆ వ్యక్తులు తమను తాము బాధితులకు ఆర్మీలో పనిచేస్తున్న సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. ఆ మేరకు వారు నకిలీ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులను కూడా బాధితులకు ఇచ్చారు. వాటిని నమ్మిన బాధితులు నిజంగానే ఐఫోన్లను తక్కువకు కొనవచ్చని ఆశపడి అంత డబ్బును నష్టపోయారు.

ఈ ఘటనలపై సైబర్ క్రైం పోలీసులు స్పందిస్తూ....
కాగా ఈ ఘటనలపై అక్కడి సైబర్ క్రైం పోలీసులు స్పందిస్తూ ఆన్లైన్లో చాలా తక్కువ ధరలకే వస్తువులను అమ్ముతామంటూ వ్యక్తులు ఇచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు. వినియోగదారులు తమకు తెలిసిన వ్యక్తుల నుంచే వస్తువులను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








