లక్షలకోట్ల విలువైన Meta ప్రాజెక్ట్కు బ్రేకులు వేసిన తేనేటీగలు..భారీప్రాజెక్ట్ వేరేప్రాంతానికి వెళ్లిపోనుందా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అనేక సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ సంస్థల జాబితాలో మెటా, గూగుల్, అమెజాన్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇందులో భాగంగా డేటా సెంటర్ల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవలే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ న్యూక్లియర్ పవర్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తరహా ఒప్పందం చేసుకున్న తొలి సంస్థగా నిలిచింది.
మరో సంస్థ అమెజాన్ కూడా 2040 నాటికి డేటా సెంటర్ల కోసం $150 బిలియన్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2040 నాటికి 240 కొత్త డేటా సెంటర్లను అందుబాటులోకి తీసుకురానుందని ఈ మార్చిలో బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది. అయితే మరో దిగ్గజ సంస్థ మెటా (Meta) కూడా డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత శక్తివంతంగా మార్చేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లు ఆర్థికంగా భారీ ఖర్చుతో కూడుకున్నవి. మరియు పర్యావరణపరంగానూ ప్రభావం చూపుతాయి. తాజాగా ఇటువంటి ఘటనే మెటా న్యూక్లియర్ పవర్ డేటా సెంటర్కు ఎదురైంది. ఫలితంగా కోట్ల రూపాయల ప్రాజెక్ట్ పై సందిగ్దత నెలకొంది.
ఏఐ ను మరింత శక్తివంతం చేసే దిశగా మెటా ఏర్పాటు చేయదలచిన న్యూక్లియర్ పవర్ డేటా సెంటర్కు సమీపంలో అరుదైన జాతికి చెందిన తేనెటీగలను గుర్తించినట్లు ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది. ఈ AI డేటా సెంటర్ కారణంగా ఆ జాతిపై ప్రభానం చూపే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో డేటా సెంటర్ ఏర్పాటుపై స్పష్టత లేకపోయింది. ఈ విషయాన్ని ఆల్ హ్యాండ్స్ మీటింగ్లో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు.
డేటా సెంటర్ ప్రణాళిక ముందుకు సాగకపోవడానికి ఇదో కారణమని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతోపాటు రెగ్యూలేటరీ సవాళ్లు కూడా మరో కారణమని జుకర్బర్గ్ తెలిపినట్లు ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది. అయితే డేటా సెంటర్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారో మాత్రం వెల్లడి కాలేదు. అయితే ఈ అంశంపై మెటా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
దీంతోపాటు మెటా నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్ఫాంలు చిన్నారుల భద్రత కోసం అనేక ఫీచర్లు ప్రవేశపెడుతున్నాయి. తాజా ఇన్స్టాగ్రామ్ చిన్నారుల రక్షణ కోసం మరో ముందడుగు వేసింది. అనేక భద్రతా ఏర్పాట్లతో ఇప్పటికే టీన్ అకౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఖాతాలు కలిగిన వారితో కనెక్ట్ కాకుండా నేరుగా డైరెక్ట్ మెసేజ్ లేదా కంటెంట్ చూసేందుకు వీలులేకుండా చర్యలు తీసుకుంది.
ఈ చర్యల నేపథ్యంలో కొంతమంది చిన్నారులు.. తమ వయస్సును ఎక్కువగా చూపి సాధారణ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తెరుస్తున్నారు. దీన్ని గ్రహించిన సంస్థ... సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. అడల్ట్ క్లాసిఫైయర్ పేరుతో విడుదల చేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్న టూల్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది. మరియు ఎంత కచ్చితత్వంతో పనిచేస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ అడల్ట్ క్లాసిఫైయర్ టూల్ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉందని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో దీని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








