Windows 10 OS ఉపయోగిస్తున్నారా.. మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి..!
Windows 10 OS : ల్యాప్టాప్లు, కంప్యూటర్లలో అనేక మంది విండోస్ 10 OS ను ఉపయోగిస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం విండోస్ 7, విండోస్ 8 సహా ఇతర OS లు ఉపయోగిస్తున్న యూజర్లు విండోస్ 10 OS అప్డేట్ అయ్యారు. అయితే ఇప్పుడు విండోస్ 10 నుంచి విండోస్ 11 కు అప్డేట్ కావాల్సిన సమయం వచ్చింది. రెండేళ్ల క్రితమే మైక్రోసాఫ్ట్ దీనిపై ప్రకటన చేసింది. తాజాగా మరోసారి యూజర్లను అప్రమత్తం చేసింది.
అక్టోబర్ 14, 2025 నుంచి విండోస్ 10 OS కు మైక్రోసాఫ్ట్ తన సపోర్టు నిలిపివేయనుంది. అంటే ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా విడుదల కావు. అయితే విండోస్ 10 OS మాత్రం పనిచేస్తుంది. భద్రత సహా ప్రైవసీ కోరుకొనే యూజర్లు కచ్చితంగా విండోస్ 11 కు అప్డేట్ కావాల్సి ఉంటుంది.

విండోస్ 10 OS కు సపోర్టు నిలిపివేత పై మైక్రోసాఫ్ట్ (Microsoft) రెండు సంవత్సరాల క్రితమే ప్రకటన చేసింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ మెహ్దీ కూడా ఈ మేరకు యూజర్లను అప్రమత్తం చేశారు. అయితే విండోస్ 10 వినియోగిస్తున్న వారి పరిస్థితి ఏంటి?
విండోస్ 10 OS కు మైక్రోసాఫ్ట్ సపోర్టు నిలిపి వేసినా OS ఎప్పటిలాగానే పనిచేస్తుంది. అయితే ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ పొందలేదు. కేవలం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అప్డేట్స్ మాత్రం 2028 అక్టోబర్ వరకు కొనసాగుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీని వల్ల ప్రైమరీ ప్రొటెక్షన్ను మాత్రమే అందిస్తుందని తెలుస్తోంది.
OS భద్రతతో పోలిస్తే యాంటీ వైరస్ తో తక్కువ స్థాయిలోనే భద్రత :
అయితే కొంత మంది యూజర్లు యాంటీ వైరస్ ను ఉపయోగిస్తుంటారు. అయితే OS నుంచి వచ్చే సెక్యూరిటీ అప్డేట్స్తో పోలిస్తే, చాలా తక్కువ స్థాయిలో మాత్రమే యాంటీ వైరస్ భద్రతను అందిస్తుందని తెలుస్తోంది.
విండోస్ 10 OS కు సపోర్టు నిలిచిపోతే ఏం జరుగుతుంది?
మైక్రోసాఫ్ట్ సపోర్టు నిలిచిపోతే భద్రత పరంగా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మాల్వేర్, కంపాటబిలిటీ వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. బ్రౌజింగ్ సమయాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

యూజర్లకు ఇప్పుడున్న ఆప్షన్లు ఏంటి?
విండోస్ 10 యూజర్లు అక్టోబర్ 14 వ తేదీ లోపల విండోస్ 11 కు అప్డేట్ కావాల్సి ఉంటుంది. విండోస్ 10 యూజర్లు ఉచితంగానే కొత్త OS కు అప్డేట్ కావచ్చు.
విండోస్ 10 లోనే కొనసాగాలని అని భావిస్తున్న యూజర్లకు మైక్రోసాఫ్ట్ మరో ఆప్షన్ ఇచ్చింది. ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రోగ్రాం (ESU) ద్వారా పూర్తి స్థాయి అప్డేట్స్ను పొందవచ్చు. సంవత్సరానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రాం కింద గరిష్ఠంగా మూడు సంవత్సరాల వరకు అప్డేట్స్ను పొందవచ్చు.
అక్టోబర్ 15 నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రోగ్రాం సబ్స్క్రిప్షన్లో భాగంగా కేవలం సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే అందిస్తామని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఎటువంటి అదనపు ఫీచర్లు, డిజైన్ మార్పులు అందుబాటులో ఉండవని చెబుతోంది.
విండోస్ 11 OS ను మైక్రోసాఫ్ట్ సంస్థ 2021 సంవత్సరం అక్టోబర్ నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త OS వెర్షన్కు అప్డేట్ అయ్యేందుకు కంప్యూటర్/ ల్యాప్టాప్ కనీసం 64 Bit ఇంటర్ఫేస్, 1 GHz స్పీడ్ ప్రాసెసర్, కనీసం 4GB ర్యామ్ మరియు 64GB కనీస స్టోరేజీని కలిగి ఉండాలి.
విండోస్ 7 OS ను 2009 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2012 లో విండోస్ 8, 2013 లో విండోస్ 8.1 వెర్షన్లను విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది వినియోగిస్తున్న విండోస్ 10 OS ను 2015 సంవత్సరంలో విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








