‘అదే జరిగితే మొబైల్ చార్జీలు పెంచక తప్పదు’

స్పెక్ట్రం ధరలకు సంబంధించిన సిఫార్సులను టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అమలు పరిస్తే కొన్ని సర్కిళ్లలో మొబైల్ చార్జీలు రెట్టింపయ్యే ప్రమాదముందని మంగళవారం టెలికాం మంత్రి కపలి సిబాల్ను కలిసిన టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాయ్ షరతులు అమలైతే పెంపు భారాన్ని ఆయా టెలికాం కంపెనీలు వినియోగదారులపైనే వెయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఒక సర్కిల్లో స్పెక్ట్రం రిజర్వ్ ధర రూ. 7 కోట్లు ఉంటే, మెట్రో నగరాల్లో దీనికి వంద రెట్లు అదనంగా స్పెక్ట్రం ధర రూ.717 కోట్లుందని, ఫలితంగా కాల్ రేట్లు అదేస్థాయిలో పెరుగుతాయని హెచ్చరించారు. టెలికాం మంత్రి సిబల్తోపాటు, టెలికాం శాఖ కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ను కలిసిన వారిలో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, యునినార్, వీడియోకాన్ సీఈవోలు ఉన్నారు.
నిజానికి టెలికాం రంగంలో ట్రాయ్ తీసుకొస్తున్న సంస్కరణలతో తమ ఆదాయానికి గండి పడుతోందని టెలికాం ఆపరేటర్లు ఎప్పటినుంచో వాదిస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








