వేతనాలు,పెన్షన్ల కోసం రోడ్డెక్కిన MTNL ఉద్యోగులు
దేశీయ టెలికాం రంగంలో మరో కంపెనీ ఉద్యోగులు రోడ్డక్కారు. మొన్నటికి మొన్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదనే వార్తలు మరువక ముందే మరో కంపెనీ MTNL (మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్) ఉద్యోగులు రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న వేతనాలు, పెన్షన్ రిలీజ్ చేయాలంటూ వారు ఆందోళన చేపట్టారు.

రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పేర్కొంటూ..టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట వీరంతా నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 22 వేల మంది ఉద్యోగుల్లో 8 వేల మంది ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు.

జూన్, జులై నెలలకు సంబంధించిన జీతాలు
పదవీ విరమణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఫిబ్రవరి నుండి జీతాలు ఆలస్యం అవుతున్నాయని కార్మిక నేతలు వెల్లడిస్తున్నారు. జూన్, జులై నెలలకు సంబంధించిన జీతాలు ఇంకా రాలేదని వాపోయారు. వెంటనే తమతో చర్చించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

అమౌంట్ రూ. 160 కోట్లు
మొత్తం వేతనాలకు సంబంధించిన అమౌంట్ రూ. 160 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. 2017-18, 2018-19 సంవత్సరాల్లో వరుసగా రూ. 2 వేల 970, రూ. 3 వేల 388 కోట్ల రూపాయల నష్టాల్లో MTNL ఉంది. BSNL, MTNL ఇరు సంస్థల ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ ఆఫర్ చేయడం..4 జీ కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయి.

BSNL, MTNL విలీన ప్రతిపాదన
మరోవైపు ప్రభుత్వరంగంలోని BSNL, MTNL విలీన ప్రతిపాదనను టెలీ కమ్యూనికేషన్స్ విభాగం డాట్ పరిశీలిస్తునట్లు తెలుస్తోంది. రెండు సంస్థల పునరుజ్జీవ ప్రణాళికకు సంబంధించి జరుగుతున్న దానిలో విలీనం కూడా ఒక అంశమని సమాచారం. MTNL, BSNL నష్టాల బాటలో సాగుతున్న విషయం తెలిసిందే. 2018-19 సంవత్సరానికి BSNL నష్టాలు రూ. 14 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా.

ఎస్ఎన్ఎల్ వ్యయ నియంత్రణ
ఇదిలా ఉంటే నిధుల కొరతతో అల్లాడుతున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ వ్యయ నియంత్రణ చర్యలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అవుట్సోర్సింగ్కి ఇచ్చిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా ఏటా రూ. 200 కోట్ల దాకా మిగుల్చుకోవచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలిఫోన్ ఎక్సే్చంజీల్లో విద్యుత్ బిల్లుల భారాన్ని కూడా తగ్గించుకోవడం ద్వారా 15 శాతం దాకా ఆదా చేయొచ్చని భావిస్తోంది. బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు వెల్లడించారు.

రూ.14 వేల కోట్ల నష్టాలు
2018-19 లో బీఎస్ఎన్ఎల్ నష్టాలు రూ. 14,000 కోట్ల మేర ఉంటాయని, ఆదాయం క్షీణించి రూ. 19,308 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో 1,65,179 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం ఆదాయంలో సిబ్బంది వేతన వ్యయాలు ఏకంగా 75 శాతంగా ఉన్నాయి. అదే ప్రైవేట్ రంగ సంస్థల విషయానికొస్తే.. 2.95-5.59% స్థాయిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నష్టాలు, రుణాల భారంతో కుంగుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను విలీనం చేసే ప్రతిపాదన కూడా కేంద్రం పరిశీలిస్తోంది.


Click it and Unblock the Notifications








