నడిసంద్రంలో అనిల్ అంబాని, ఆర్కామ్ పయనమెటు..?
అప్పుల ఊబిలో ఆర్కామ్, అనిల్ అంబానికేమైంది, జియో చేతికి ఆర్ కామ్ వెళుతోందా..ఎన్నో ప్రశ్నలు..?
ఆర్కామ్..ఒకప్పుడు టెలికం సామ్రాజ్యాన్ని పరుగులు పెట్టించిన దిగ్గజం.. వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఆర్కామ్ని పరుగులు పెట్టించిన అనిల్ అంబాని నేడు నడిసంద్రంలో చిక్కుకున్నారు. ఆర్కామ్ నాడు లాభాల వైపు పరుగులు పెడితే నేడు నష్టాల ఊబిలో చిక్కి విలవిలలాడుతోంది. కంపెనీకి రుణభారం ఎక్కువైపోవడంతో మార్కెట్లో ఆర్కామ్ విలువ రోజు రోజుకు క్షీణిస్తూ పోతోంది. ఈ నేఫథ్యంలో అన్న ముఖేష్ అంబాని ఆర్కామ్ ఆస్తులను కొనుగోలు చేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి..ఆర్కామ్ కి అసలు ఏమైంది..?

ధీరూబాయి అంబాని జయంతి సంధర్భంగా..
2002వ సంవత్సరం ఇదే నెలలో రిలయన్స్ ఇన్పోకామ్ టెలికం మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీనికి ఆధ్యుడుగా ఇప్పటి జియో అధినేత ముకేష్ అంబానీని చెప్పుకోవచ్చు. తన తండ్రి ధీరూబాయి అంబాని జయంతి సంధర్భంగా రిలయన్స్ ఇన్ఫోకామ్ సేవలను ప్రారంభిస్తున్నానంటూ సగర్వంగా ప్రకటించారు.

ప్రకటించిన మూడేళ్లకు..
అయితే ప్రకటించిన మూడేళ్లకు రిలయన్స్ సామ్రాజ్యంలో చీలికలు ఏర్పడ్డాయి. ఎంతో ముచ్చటపడి ప్రారంభించిన రిలయన్స్ ఇన్ఫోకామ్ ముకేష్ అంబాని చేతుల నుంచి అనిల్ అంబాని చేతుల్లోకి మారింది.

టెలికం కంపెనీ రంగంలో అత్యంత వేగంగా పరుగులు
అనిల్ అంబాని చేతిలోకి వెళ్లిన ఆర్ కామ్ సామ్రాజ్యం టెలికాం రంగంలో అత్యంత వేగంగా పరుగులు పెట్టింది. ఆ వేగంలోనే సీడీడీఎం టెక్నాలజీ నుంచి జీఎస్ఎం టెక్నాలజీ వైపు అడుగులు పడ్డాయి. ఇది 2008లో జరిగింది.

జీఎస్ఎం టెక్నాలజీతో ..
జీఎస్ఎం టెక్నాలజీతో మార్కెట్లో షేర్ విలువ ఊహించనంత ఎత్తుకు వెళ్లింది. అప్పడు షేర్ విలువ దాదాపు రూ. 845గా నమోదైంది. కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లుగా నమోదైంది.

కోట్ల నష్టాలతో నేడు ..
మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయాన్ని రుజువు చేస్తూ రిలయన్స్ కమ్యూనికేషన్ తరువాత దారితప్పింది. కోట్ల నష్టాలతో నేడు సతమతమవుతోంది. రూ.845 షేరుతో నాడు రికార్డులు సృష్టించిన కంపెనీ నేడు అత్యంత తక్కువగా రూ.11.80 వద్ద ఊగిసలాడుతోంది.

రూ. 2లక్షల కోట్ల నుంచి..
రూ. 2లక్షల కోట్ల నుంచి ఒక్కసారిగా సుమారు రూ.3,270 కోట్లకు కంపెనీ దిగజారిపోయిందని రిపోర్టులు చెబుతున్నాయి. మరి ఇంతలా కంపెనీ వెనకకు రావడానికి అనేక కారణాలను విశ్లేషిస్తే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి.కంపెనీ చేతికందిన తొలినాళ్లలో అనిల్ అంబానీ ఏకంగా రూ.450 కోట్ల బకాయిలను రైటాఫ్ చేయడంతో సమస్య ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

డబ్బులు తిరిగి రాకపోవడం..
కంపెనీ నుంచి మార్కెట్లోకి వెళ్లిన హ్యాండ్సెట్లను ఆఫర్లలో విక్రయించడం, వాటి డబ్బులు తిరిగి రాకపోవడం కూడా కంపెనీ పతనావస్థకు దారి తీసిందనే వార్తలు వెలువడుతున్నాయి.

సోదరుల మధ్య ఉన్న ఒప్పందం
కాగా ఈ నష్టాలను పూడ్చుకోవడానికి అనిల్ అంబాని ఎంటీఎన్ కంపెనీ వాటాలు విక్రయించాలని ప్రయత్నించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీనికి కారణం సోదరుల మధ్య ఉన్న ఒప్పందమే.

ఎవరైనా వాటాను విక్రయించాలంటే
ఈ ఒప్పందం ప్రకారం ఇద్దరిలో ఎవరైనా వాటాను విక్రయించాలంటే అది ముందుగా సోదరుడికి ఇవ్వాలి. అతను వద్దంటేనే బయటికి వెళ్లాలి. దీని ప్రకారం జియో అధినేత అడ్డు చెప్పడంతో అనిల్-ఎంటీఎన్ మధ్య చర్చలు సఫలం కాలేదని తెలుస్తోంది.

పెరిగిపోతున్న రుణభారాలు..
ఓ వైపు పెరిగిపోతున్న రుణభారాలు మరో బెడిసికొట్టిన వ్యూహాలు వెరసి ఆర్ కామ్ అప్పులు మోయలేనివిగా మారాయి. చివరకు కీలకం కాని ఆస్తుల్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో టవర్ల వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టినా అడుగుముందుకు పడలేదు.

ఎయిర్సెల్ ఆర్కామ్ విలీన ప్రయత్నాలు..
మరో వైపు ఎయిర్సెల్ ఆర్కామ్ విలీన ప్రయత్నాలు బెడిసికొట్టడం, రుణదాతలు దివాలా పిటిషన్లు, ఇతర టెలికాం కంపెనీల నుంచి బహిరంగ ప్రకటనలు ఆర్కామ్ను దెబ్బమీద దెబ్బ కొట్టాయనే చెప్పవచ్చు.

విక్రయాల ద్వారా కంపెనీ రూ. 27 వేల కోట్ల వరకు..
2 సర్వీసులను నిలిపివేయడం దగ్గర నుంచి టెలికం టవర్లను, స్పెక్ట్రమ్, రియల్ ఎస్టేట్ ఆస్తులను, తాజాగా డీటీహెచ్ విభాగాన్ని విక్రయించింది. ఇతరత్రా విక్రయాల ద్వారా కంపెనీ రూ. 27 వేల కోట్ల వరకు సమీకరించనుందని అనధికార వర్గాల సమాచారం.

ఆర్కామ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు..
అయినప్పటికీ కంపెనీ అప్పులు తీరే సమస్య కనపడటం లేదు. ఈ నేపథ్యంలో ఆర్కామ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు జియో అధినేత ముకేష్ అంబాని రెడీ అవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

జియో నుంచి ఎటువంటి ప్రకటన..
మరి నిజంగానే ముకేష్ అంబాని ఆర్కామ్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై జియో నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. కాగా ఆర్కామ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.3,270 కోట్లయితే... అప్పులు ఏకంగా రూ.46వేల కోట్లు.


Click it and Unblock the Notifications








