చందమామపై మిస్టరీ వస్తువు,చూసి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
చందమామపై రోజు రోజుకు ప్రయోగాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. చందమామపై నివసింసేందుకు అనువుగా ఉంటుందా. చందమామ పై నీరు ఉందా అనే దాని మీద ఇప్పటికే అన్ని దేశాలు తమ పరిశోధనలను సాగిస్తున్నాయి. కాగా చందమామపై భారీగా నీరు ఉందని ఈమధ్యే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు బేలోర్ యూనివర్శిటీ పరిశోధకులు మరో ఆసక్తికర అంశాన్ని బయట ప్రపంచానికి అందిచారు. వీరి పరిశోధన ప్రకారం చందమామపై ఉండే అతి పెద్ద లోయలో మిస్టీరియస్ వస్తువు (లోహం) ఉందని తేల్చారు. ఈ మిస్టరీ వస్తువు హవాయ్లోని అతి పెద్ద దీవి కంటే ఐదు రెట్లు పెద్దగా ఉందని వారు చెబుతున్నారు. ఈ మిస్టరీ వస్తువు లోహం లాగా ఉందని అది ఏంటో తెలిస్తే చందమామ ఎలా ఏర్పడిందో తెలిసేందుకు వీలవుతుందని అంటున్నారు. చందమామ దక్షిణ ధృవంలోని అయిట్కెన్ బేసిన్ (Aitken basin) లోయ లోపల అది ఉన్నట్లు చెబుతున్నారు.

ఎలా సాధ్యమయింది ?
అంత పెద్ద లోహం చందమామలోకి ఎలా వచ్చిందనే విషయం ఇప్పుడు సైంటిస్టుల్ని ఆశ్చర్యపరుస్తోంది. వాళ్లు చెబుతున్న సమాచారం ప్రకారం 40 లక్షల సంవత్సరాల కిందట భారీ గ్రహశకలం చందమామను ఢీకొట్టిందనీ అప్పుడే ఈ భారీ లోయ ఏర్పడిందనీ ఆ గ్రహ శకలంలోని లోహ పదార్థమే ఆ లోయ లోపల ఉందని అంచనా వేస్తున్నారు. లోయలో 300 కిలోమీటర్ల లోపల అది ఉందని అంటున్నారు.

టెలిస్కోప్లో చూసినా
అయితే ఆ లోయలోని వస్తువు మనకు కనిపించదు మనం చందమామను టెలిస్కోప్లో చూసినా ఆ లోయ కనిపించదు. దీనికి కారణం ఏంటంటే అది భూమివైపు కాకుండా చందమామకు వెనకవైపు ఉన్న దక్షిణ ధృవంలో ఉంది. ఆ వస్తువు ఏ గ్రహాంతర వాసుల స్పేస్ షిప్పో కావచ్చని కొంతమంది ఔత్సాహికులు అనుకుంటున్నారు. దీనికి సైంటిస్టులు అలా అయ్యే అవకాశం లేదని అది ఎలాంటి లోహమో కచ్చితంగా తెలియదని చెబుతున్నారు. ఓ అంచనా ప్రకారం అది ఐరన్-నికెల్ కలగలిసిన లోహం కావచ్చని చెబుతున్నారు.

చంద్రయాన్-1 మిషన్ అందించిన సమాచారం ద్వారా
ఇదిలా ఉంటే చంద్రునిపై నీటి, మంచు నిక్షేపాలు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గతేడాది వెల్లడించింది. చంద్రునిపై ఘన స్థితిలో పలు ప్రాంతాల్లో నీటి నిక్షపాలు ఉన్నట్లు నాసా ప్రకటించింది. పదేళ్ల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 మిషన్ అందించిన సమాచారం ద్వారా ఈ అంశాలను విశ్లేషించిన నాసా వాటిని నిర్ధారించింది. చంద్రయాన్-1 అందించిన సమాచారాన్ని ప్రకారం చంద్రునిపై గల శీతల భాగాల్లో మంచు నిక్షేపాలు కూడా ఉన్నాయని నాసా వెల్లడించింది. భవిష్యతుల్లో చంద్రుడిపైకి వెళ్లె యాత్రికులకు అక్కడ నివసించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది.

2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1
చంద్రుని దక్షిణ ద్రువం వద్ద మంచు కేంద్రీకృతమై ఉందని.. ఆ మంచు పొరలు ఉత్తర దృవం వద్ద మరింత విస్త్రతంగా లభిస్తాయని పేర్కొంది. 2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1పై ఎం3 అనే పరికరాన్ని నాసా అమర్చిన విషయం తెలిసిందే. నాసాకు చెందిన ఎం3 పరికరం ద్వారా అక్కడి సమాచారాన్ని, మంచు, నీరు జాడలను సేకరించింది. చంద్రుని ధ్రువాల వద్ద ఎక్కువ మంచు ఉందని.. అక్కడ ఉష్ణోగ్రత -156 డిగ్రీలకు మించదని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా గతంలోనే చంద్రునిపై పలు పరిశోధనలు చేసిన నాసా చంద్రునిపై నీరు, మంచు ఉండే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మన అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని అక్కడికి పంపేందుకు కసరత్తు చేస్తోంది.

చంద్రునిపై నీటి ఆవిరి
గతేడాది నాసా ప్రయోగించిన రాకెట్ చంద్రునిపై దక్షిణ ప్రాంతంలో ఉపరితలంలో ఉన్న లోతైన బిలాన్ని గట్టిగా ఢీకొన్నది. లూనార్ క్రేటర్ అబ్జర్వేషన్ అండ్ సెన్సింగ్ శాటిలైట్ ఎల్క్రాస్ చంద్రునిపై ఉన్న కేబియస్ క్రేటర్ను ఢీకొన్నది. చంద్రునిపై నీటి జాడల్ని కనుగొనేందుకు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. ఈ ప్రయత్నంలో ఘన విజయం సాధించామని, చంద్రునిపై భారీగా నీటి నిల్వలున్నాయని తెలిసిందని నాసా శాస్తజ్ఞ్రులు ప్రకటించారు. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో నాసా రాకెట్ బలంగా ఢీకొన్నప్పుడు అక్కడ భారీగా మంచు ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. చంద్రునిపై నీటి ఆవిరి 24 గాలన్ల బక్కెట్లకు (దాదాపు 90 లీటర్లు) సమానమని నాసా శాస్తజ్ఞ్రుల్లో ఒకరు వర్ణించారు. రాకెట్ ఢీకొన్నప్పుడు ఉపరితలంపై చాలా ప్రాంతంలోదట్టమైన దుమ్ము వ్యాపించింది. చంద్రునిలో దాగున్న రహస్యాల్ని కనిపెడుతున్నామని వారు అన్నారు.

అపోలో–15, అపోలో–17 అంతరిక్ష నౌకలు
రెండేళ్ల క్రిందట చంద్రుడి నుంచి తీసుకొచ్చిన గాజులాంటి పదార్థంలో లేశమాత్రంగా నీరు ఉన్నట్లు బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అల్బ్రెట్టో సాల్ గుర్తించారు. అగ్ని పర్వతాల నుంచి ఎగజిమ్మిన ఈ పదార్థం చంద్రుడి ఉపరితలంపై విస్తరించి ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా అక్కడ మునుపటి కంటే ఎక్కువ నీరు ఉన్నట్లుగా తెలుస్తోందని బ్రౌన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాల్ఫ్ మిలికెన్ చెబుతున్నారు. పోలో-15, అపోలో-17 అంతరిక్ష నౌకలు దిగిన ప్రాంతంతో పాటు చాలాచోట్ల ఈ గాజులాంటి పదార్థ నిక్షేపాలను ఉపగ్రహాల ద్వారా తాము గుర్తించామని, వాటిల్లోనూ నీటిజాడలు స్పష్టంగా కనిపించడంతో జాబిల్లి అంతర్భాగంలోనూ నీరు ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తెలుస్తోందని రాల్ఫ్ వివరించారు.


Click it and Unblock the Notifications