కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలా.. అయితే ఈ కొత్త రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..!
భారత్ లో గతంలో సిమ్ కార్డులు కొనుగోలు చేసే ప్రక్రియ కొంత సులభంగా ఉండేది. అయితే విచ్చలవిడిగా సిమ్ కార్డులు అందుబాటులో ఉండడం కారణంగా సైబర్ నేరగాళ్లు వీటిపై దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను రూపొందించింది. నకిలీ సిమ్ కార్డుల విక్రయాలను కట్టడి చేస్తే.. సైబర్ నేరాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు నకిలీ సిమ్ కార్డులను పెద్ద ఎత్తున బ్లాక్ చేస్తోంది.
ఒకరు ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చు! :
ఇప్పటికే కొత్త సిమ్ కార్డుల ( New Sim Card Rules ) జారీ నిబంధనలను కఠినతరం చేసింది. ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్ కార్డులను మాత్రమే తీసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీంతోపాటు సిమ్ కార్డులతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొనేలా నిబంధనలు తీసుకొచ్చింది.

ఇది లేకుండా సిమ్ కార్డు కొనుగోలు చేయలేరు :
అయితే తాజాగా మరికొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. గతంలో ఆధార్తోపాటు పాస్పోర్టు, ఇతర గుర్తింపు కార్డుల ద్వారా కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం సిమ్ కార్డు కొనుగోలు చేసేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
అంటే సిమ్ కార్డు కావాల్సిన వ్యక్తి కచ్చితంగా బయోమెట్రిక్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఒక వ్యక్తి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలిసేలా ప్రత్యేక విభాగం దృష్టిసారిస్తుందని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఈ వివరాలను ట్రాక్ చేస్తారని తెలుస్తోంది.
డీలర్స్ పై కఠిన చర్యలు :
దీంతోపాటు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తిచేయకుండా సిమ్ కార్డులను జారీచేసే వారిపై కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించనుంది. భారీస్థాయిలో జరిమానాలతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు మరో కీలక ఆదేశాలు కూడా జారీచేసింది.
BSNL మాత్రం ఇంకా పెండింగ్ :
సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తులు, డీలర్లు ఆయా సంస్థల వద్ద కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వద్ద రిజిస్ట్రేషన్లు పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL వద్ద ఇంకా పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగలేదు. అయితే సంస్థ అధికారులు దీనిపై నిర్దేశిత గడువు విధించినట్లు తెలుస్తోంది.
ఫోటో వెరిఫికేషన్ :
ఏప్రిల్ 1 2025 నుంచి టెలికాం సంస్థల వద్ద రిజిస్ట్రేషన్లు చేసుకున్న డీలర్లు మాత్రమే సిమ్ కార్డులు విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతోపాటు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తిచేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే.. ఫోటో వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేసే వారు 10 యాంగిల్స్ లో ఫోటోలు తీసుకొనేందుకు అనుమతించాల్సి ఉంటుంది. నకిలీ సిమ్ కార్డులను కట్టడి చేయడం మరియు సైబర్ నేరాలను నియంత్రించడంలో భాగంగా ఈ అదనపు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రధాన మంత్రి కార్యాలయం కూడా గతంలో టెలికాం మంత్రిత్వ శాఖకు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థల సాయంలో సిమ్ కార్డులను దుర్వినియోగం చేసే వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ తరహా చర్యలతో సిమ్ కార్డులను వినియోగించి నేరాలకు పాల్పడే వ్యక్తులను కట్టడి చేయాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications








